మహిళలూ జాగ్రత్త... లైంగిక అణచివేతలో కొత్త పోకడలు: వాసిరెడ్డి పద్మ హెచ్చరిక
''మహిళల అక్రమ రవాణా- లైంగిక అణచివేత- ఆన్లైన్ భద్రత'' అనే అంశాలపై ఆగస్టు 17 నుండి 19 వరకు 3 రోజులు పాటు జరిగే వెబినార్ ను ఏపీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మంగళవారం ప్రారంభించారు.
అమరావతి: మహిళల అక్రమ రవాణా, లైంగిక అణచివేతలో అక్రమార్కులు కొత్త ఆధునిక పద్దతులను ఉపయోగిస్తున్నారని... వీటిపై దర్యాప్తు సంస్థలు సమగ్ర దృష్టి సారించాలని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు.
''మహిళల అక్రమ రవాణా- లైంగిక అణచివేత- ఆన్లైన్ భద్రత'' అనే అంశాలపై ఆగస్టు 17 నుండి 19 వరకు 3 రోజులు పాటు జరిగే వెబినార్ ను వాసిరెడ్డి పద్మ మంగళవారం ప్రారంభించారు. అమెరికా, ఆఫ్రికా, ఫిలిప్పీన్స్, నేపాల్, పాకిస్థాన్, వియాత్నం, ఇటలీ దేశాలు సహా 13 రాష్ట్రాల భారతదేశ ప్రతినిధులు పాల్గొన్న ఈ ఈ అంతర్జాతీయ వెబినార్ లో వాసిరెడ్డి పద్మ ప్రారంభోపన్యాసం చేశారు.
''ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మహిళల అక్రమ రవాణా నిరోధించటానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేయడమే కాదు ప్రత్యేకంగా పోలీస్ అధికారులను నియమించింది. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ వంటి సంస్థలతో కలిసి యూనివర్సిటీలలో, కాలేజిల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లబ్ లను ఏర్పాటు చేసింది. అలాగే అనేక ప్రాంతాల్లో అవగాహనా సదస్సు లు నిర్వహిస్తోంది'' అని పేర్కొన్నారు.
read more ఎన్నారై టెక్కీ ఇండియాకు వచ్చి యువతులతో క్రీడ: ఐదో పెళ్లికి సిద్ధపడి....
''ఆన్లైన్ ద్వారా అమాయక యువతులపై వల విసురుతున్న కేటుగాళ్ళ గురించి స్కూల్ స్థాయి వరకు బాలికలకు, విద్యార్థినులకు అవగాహన కల్పించుటకు మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటోంది. అయితే ఆన్లైన్ ద్వారానే కాకుండా ఇతర కొత్త పద్ధతులను ఉపయోగించి అక్రమ రవాణా ముఠాలు మహిళలను దొంగ దెబ్బ తీస్తున్నాయి'' అని పద్మ ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడలోని మేరీ స్టెల్లా కాలేజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఇంటర్నేషనల్ వెబినార్ లో అనేకమంది ప్రముఖులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియచేసారు. మరో రెండు రోజుల పాటు ఈ వెబినార్ కొనసాగనుంది.