చంద్రబాబు పై రాధా ధ్వజం
- చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతున్నట్లు మండిపడ్డారు.
- వంగవీటి రంగాపై గౌతమ్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపధ్యంలో తలెత్తిన అవాంఛనీయ సంఘటనలపై రాధా మీడియాతో బుధవారం మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆరోజు విజయవాడలో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తినట్లు అభిప్రాయపడ్డారు.
- తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపులపై అభిమానం ఉండబట్టే వెంటనే గౌతమ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేసారు.
- అదే సమయంలో అసలేం జరిగిందో తెలుసుకోకుండానే వ్యాఖ్యలు చేయటం చంద్రబాబుకు తగదన్నారు.
చంద్రబాబునాయుడు మీద వంగవీటి రాధాకృష్ణ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతున్నట్లు మండిపడ్డారు. వంగవీటి రంగాపై గౌతమ్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపధ్యంలో తలెత్తిన అవాంఛనీయ సంఘటనలపై రాధా మీడియాతో బుధవారం మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆరోజు విజయవాడలో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తినట్లు అభిప్రాయపడ్డారు.
ఆరోజు మీడియా సమావేశం పెట్టటానికి మాత్రమే తమ కార్యాలయంకు వెళుతుండగా పోలీసులు అడ్డుకుని పోలీస్టేషన్ కు తీసుకెళ్ళినట్లు వివరించారు. అదే సమయంలో తన తల్లి, మాజీ శాసనసభ్యురాలైన వంగవీటి రత్నకుమారి రోడ్డుపై పడిపోయినా, పోలీసు స్టేషన్ కు తరలించే సమయంలో కుడా ఒక్క మహిళా కానిస్టేబుల్ కుడా లేదని మండిపడ్డారు. జరిగిన ఘటనపై చంద్రబాబు విచారణ చేయిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపులపై అభిమానం ఉండబట్టే వెంటనే గౌతమ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేసారు. అదే సమయంలో అసలేం జరిగిందో తెలుసుకోకుండానే వ్యాఖ్యలు చేయటం చంద్రబాబుకు తగదన్నారు. చంద్రబాబు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నట్లు ఎద్దేవా చేసారు. ఒక మాజీ శాసనసభ్యురాలిని రోడ్డుపై ఈడ్చుకెళ్ళిన పోలీసు అధికారులపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ పై చంద్రబాబుకు పట్టులేకపోవటమే కారణమని రాధా అభిప్రాయపడ్డారు.
వైసీపీలో క్రమశిక్షణ ఉంది కాబట్టే ఎవరు తప్పు చేసినా వెంటనే చర్యలు తీసుకునే ధైర్యం తమ అధ్యక్షుడుకి ఉందన్నారు. అదే సమయంలో స్వయంగా చంద్రబాబుపైనే అనుచిత వ్యాఖ్యలు చేసిన జెసి దివాకర్ రెడ్డి లాంటి నేతలపైన ఎటువంటి చర్యలు తీసుకోలేని స్ధితిలో చంద్రబాబు ఉన్నాడంటూ ధ్వజమెత్తారు. టిడిపిలోని వివాదాలను చక్క దిద్దుకోకుండా వైసీపీ నేతల మధ్య గొడవలును ప్రస్తావించటం చంద్రాబాబుకు తగదన్నారు. ముఖ్యమంత్రి స్ధాయికి తగ్గట్లుగా చంద్రబాబు నడుచుకోవాలంటూ హితవుకూడా చెప్పారు.