వైఎస్సార్ కాంగ్రెసు అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.

తాడేపల్లిగూడెం: వైఎస్సార్ కాంగ్రెసు అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభ సందర్భంగా ఆ సంఘటన చోటు చేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఓ మహిళ డ్రైనేజీలో పడిపోయింది. దాంతో ఆమె ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. బహిరంగ సభలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

తెలుగుదేశం పార్టీ నాయకులకు రౌడీయిజంలో చంద్రబాబు శిక్షణ ఇస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని సీట్లలో కూడా టీడీపిని గెలిపిస్తే చంద్రబాబు ఈ జిల్లాకు ఏం చేశారని ఆయన అడిగారు. తాడేపల్లిగూడెంకు విమానాశ్రయం తెస్తానని చంద్రబాబు చెప్పారని, విమానాశ్రయం మాట దేవుడెరుగు రోడ్లయినా బాగు చేయించారా అని అన్నారు. 

చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఎస్ఐటి ప్రహారి గోడ కూడా కట్టలేదని అన్నారు. ఒక్క కాలేజీని కూడా ఇవ్వలేదని విమర్శించారు. నాలుగేళ్ల పాటు ఆ పెద్ద మనిషి పాలన చూశారు, ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి, అప్పుడు మీకు ఏ నాయకులు కావాలో ఆలోచన చేయండని ఆయన అన్నారు.

చంద్రబాబు నాలుగేళ్ల పాలన ఎలా ఉందో గమనించాలని ఆయన కోరారు. అబద్ధాలు చెప్పే నాయకుడు కావాలా అని అడిగారు. నాలుగేళ్ల కిందట చంద్రబాబు చెప్పిన మాటలేమిటి, నాలుగేళ్లలో చేసిన పనులేమిటో చూడాలని ఆయన కోరారు.