సిఎం రమేష్ ఆరోగ్యం విషమం: కేంద్ర మంత్రి ఫోన్
కడప ఉక్కు కర్మాగారం కోసం గత వారం రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్కు కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ ఫోన్ చేశారు.
కడప: కడప ఉక్కు కర్మాగారం కోసం గత వారం రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్కు కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ ఫోన్ చేశారు. దీక్ష విరమించాలని ఆయన రమేష్ ను కోరారు.
ఖమ్మం, కడపల్లో స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందని బీరేంద్రర్సింగ్ తెలిపారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై టీడీపీ ఎంపీలు తనను కలిసి చర్చించారని ఆనయ చెప్పారు. అలాగే ఆమరణ దీక్ష చేస్తున్న సీఎం రమేష్, బీటెక్ రవి దీక్ష విరమించాలని ఫోన్ చేసి కోరినట్లు తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీపై టాస్క్ఫోర్స్ నివేదిక రాగానే తదుపరి చర్యలుంటాయని చెప్పారు.
అందుకు ఏపీ ప్రభుత్వం కూడా సహకారం అందించాలని ఆయన అన్నారు. ఈ విషయంపై టీడీపీ ఎంపీలు కూడా సంతృప్తి చెందారని చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రైవేటు భూమి ఎంత అందుబాటులో ఉందనే విషయంపై వివరాలు కోరినట్లు తెలిపారు. ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే చూడాలన్నారు.
ఇదిలావుంటే, గత వారం రోజులుగా దీక్ష చేస్తున్న సీఎం రమేష్ ఆరోగ్యం క్షీణించింది. తక్షణం వైద్యం అందించకపోతే ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉక్కు మంత్రి బీరేంద్రసింగ్ను టీడీపీ ఎంపీలు కలిసి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
గంట గంటకూ సిఎం రమేష్, బిటెక్ రవి షుగర్ లెవల్స్, బీపీ తగ్గుతున్నాయి. ఈ స్థితిలో దీక్షను భగ్నం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.