విశాఖ స్టీల్  ప్లాంట్  ప్రైవేటీకరణ విషయంలో  కేంద్ర  ఉక్కు  శాఖ సహాయ మంత్రి  ఫగ్గన్ సింగ్  కీలక వ్యాఖ్యలు  చేశారు. 


విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ చెప్పారు. గురువారంనాడు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ విశాఖపట్టణం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఐఎన్ఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఈ విషయమై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. ఈఓఐలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఎత్తుగడగా కేంద్ర మంత్రి మంత్రి అభిప్రాయపడ్డారు. 

రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. నష్టాల్లో ఉందని విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్రం ప్రకటించింది . ఇటీవల పార్లమెంట్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కూడా ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గమని కేంద్రం ప్రకటించింది. కానీ ఇవాళ ఈ విషయమై కేంద్రం వెనక్కు తగ్గినట్టు ప్రకటించింది.

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి పోరాటం చేస్తున్నాయి. ప్రైవేటీకరణను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ముడి సరుకును అందిస్తే లాభాల్లో నడుస్తుందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు

also read:విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో పాల్గొంటే ప్రైవేటీకరణను సమర్ధించినట్టే: కేసీఆర్ పై ఏపీ మంత్రి అమర్ నాథ్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఏపీ రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి ఎలా వస్తుందో తాము చెబుతామని కార్మిక సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. ప్రధానితో సమావేశం ఏర్పాటు చేయిస్తే ఈ విషయాలను వివరిస్తామని కూడా కార్మిక సంఘాల జేఏసీ నేతలు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే