స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్: జగన్ కొలువులోకి రేపోమాపో
స్టీఫెన్ రవీంద్రకు ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ గా నియామకానికి లైన్ క్లియరైంది. కేంద్ర హోంశాఖ నుండి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.స్టీఫెన్ రవీంద్ర వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన వద్ద సెక్యూరిటీ అధికారిగా పనిచేశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియామకానికి లైన్ క్లియరైంది. ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్కు కేంద్ర హోంశాఖ బుధవారంనాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయమై రెండు మూడు రోజుల్లో కేంద్రం నుండి ఆదేశాలు జారీ కానున్నాయి.
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత స్టీఫెన్ రవీంద్రను ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించుకోవాలని భావించారు.ఈ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్తో కూడ ఏపీ సీఎం వైఎస్ జగన్ చర్చించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడ ఈ విషయమై అంగీకారం తెలిపారు. మరో వైపు ఇదే విషయమై ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ కోసం కేంద్రానికి లేఖరాశారు.
ఈ విషయమై కేంద్రం నుండి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఈ విషయమై మరోసారి తమ ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో కేంద్రం నుండి సానకూలంగా స్పందన లభించింది. రెండు మూడు రోజుల్లో స్టీఫెన్ రవీంద్రకు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. రెండు నెలలుగా స్టీఫెన్ రవీంద్ర సెలవులో ఉన్నాడు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. దీంతో స్టీఫెన్ రవీంద్రను జగన్ ఇంటలిజెన్స్ విభాగానికి చీఫ్ చేయాలని భావించారు.
ఇదే తరహలో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడ ఏపీలో పనిచేసేందుకు సంసిద్దతను వ్యక్తం చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఆమె కలిశారు. తెలంగాణ కేడర్ కు చెందిన ఆమె ఏపీ కేడర్ లో పనిచేసేందుకు ఆసక్తిని కనబర్చారు. కేడర్ మార్పు కోసం ఆమె డీఓపీటీని ఆశ్రయించారు.
కానీ, శ్రీలక్ష్మి విషయంలో డీఓపీటీ నుండి కూడ ఎలాంటి సమాధానం రాలేదు. వారం రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను శ్రీలక్ష్మి కలిశారు. కేడర్ మార్పు విషయమై ఆమె అమిత్ షా తో చర్చించారు. శ్రీలక్ష్మికి కూడ కేడర్ మార్పు విషయంలో సానుకూలమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.