వీడు కీచకుడు: బాలికపై చిన్నాన్న అత్యాచారం
ఓ దుర్మార్గుడు వావివరుసల మరిచి వ్యవహరించాడు. వరుసకు కూతురయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు.
కాకినాడ: ఓ దుర్మార్గుడు వావివరుసల మరిచి వ్యవహరించాడు. వరుసకు కూతురయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
అయితే ఆ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. చినజగ్గంపేటలోని ఎస్సీ కాలనీకి చెందిన 15 ఏళ్ల బాలిక పిఠాపురంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. చిన్నతనంలోనే తల్లి మరణించింది. తండ్రికి చూపు సరిగా కనిపించదు.
దాంతో మేనత్త ఇంట్లో ఉంటూ ఇంటర్లో చేరే ప్రయత్నాలు చేస్తోంది. ఈనెల 6న రాత్రి 9 గంటల సమయంలో బయటకి వెళ్లి వస్తున్న ఆమెపై ఇంటి పక్కనే ఉంటున్న చిన్నాన్న వరుసయ్యే కొంగి ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఎవరికైనా చెప్తే ఆమెతోపాటు ఆమె తండ్రినీ చంపేస్తానని బెదిరించాడు. ఆ బాలిక ఇంట్లో చెప్పడంతో విషయం పెద్దల దాకా వచ్చింది. వారు రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేశారు. అయితే, బాలిక తండ్రి మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.