క్షద్రపూజలతో భయపెట్టి ఓ మైనర్ బాలికపై నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడి చివరకు గర్భవతిని చేసారు ఇద్దరు వృద్దులు. ఈ దారుణం తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.
తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలు, చిన్నారులపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై, రేపల్లెలో దళిత గర్భిణిపై గ్యాంగ్ రేప్, అనకాపల్లి జిల్లాలో ఆరేళ్ళ చిన్నారిపై అఘాయిత్యం ఘటనలు మరువకముందే తిరుపతి జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. గత నాలుగు నెలలుగా మైనర్ బాలికపై ఇద్దరు వృద్దులు అత్యాచారానికి పాల్పడుతుండగా వారి పాపం పండి తాజాగా ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే... తిరుపతి జిల్లా దక్కిలి మండలం నాగవోలు పంచాయితీ మహాసముద్రం గ్రామానికి చెందిన మైనర్ బాలికపై శ్రీరాం సుబ్బయ్య(55), భాస్కర్(60) అనే ఇద్దరు వృద్దులు కన్నేసారు. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తమకు క్షుద్రపూజలు చేయడం వచ్చని... తాము చెప్పినట్లు వినకపోతే తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన బాలిక వారి నీచానికి పాల్పడుతున్నా మౌనంగా వుంది. ఇలా బాలికను బెదిరించి గత నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడగా తల్లిదండ్రులు హాస్పిటల్ కు తరలించారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలిక గర్భం దాల్చినట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు నిలదీయగా తనపై గత నాలుగు నెలలుగా జరుగుతున్న అఘాయిత్యం గురించి బాలిక బయటపెట్టింది.
తమ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు వృద్దులపై తల్లిదండ్రులు దక్కిలి పోలీసులకు ఫిర్యాదు చేసారు. వారిపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే రెండురోజుల క్రితం అనకాపల్లి జిల్లాలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం, శ్రీసత్యసాయి జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి రాష్ట్రంలో కలకలం రేపాయి. నర్సీపట్నం మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు అక్కాచెల్లెల్లపై వారి ఇంటిపక్క యువకుడే కన్నేసాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన యువకుడు అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి 2 గంటల సమయలో బాలికలిద్దరూ బహిర్భూమికి వెళ్ళగా ఇదే అదునుగా రహస్యంగా వారిని అనుసరించిన యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇద్దరిలో చిన్నదైన ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇక శ్రీసత్యసాయి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రేమిస్తున్నానంటూ నమ్మించిన యువకుడి తోటలో యువతి తీవ్ర గాయాలతో మృతిచెందడం కలకలం రేపింది. అయితే యువతిది ఆత్మహత్య కాదని... గ్యాంగ్ రేప్ చేసి చంపారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. గోరంట్లకు చెందిన యువతి తిరుపతిలోని ఓ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. ఈమె గోర్లంట్లలో అద్దెకుండే ఇంటికి సమీపంలో సాదిక్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ గురించి తెలిసి యువతి తల్లిదండ్రులు ఇంటిని ఖాళీచేసి మరో చోట అద్దెకున్నారు. అయినప్పటికి యువతితో సాదిక్ ప్రేమాయణం కొనసాగుతూనే వుంది.
ఏమయ్యిందో తెలీదుగానీ తిరుపతిలో వుండాల్సిన యువతి ప్రియుడు సాదిక్ ఫామ్ హౌస్ లో శవంగా తేలింది. శరీరంపై గాయాలతో ఓ షెడ్ లో ఉరేసుకుని యువతి మృతదేహం లభించింది. యువతిని తిరుపతినుండి తీసుకువచ్చి సాదిక్ తో పాటు అతడి స్నేహితులు సామూహిక అత్యాచారం జరిపి హత్యచేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి చనిపోయాక ఉరేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అయితే పోలీసులు, పోస్టుమార్టం చేసిన వైద్యులు మాత్రం యువతిపై అత్యాచారం జరగలేదని చెబుతున్నారు.
