ఏపీలో తుగ్లక్ పాలన సాగుతోంది.. జగన్ పై కేంద్ర మంత్రి మురళిధరన్ కామెంట్స్
ఏపీలో సీఎం జగన్ ఒకే మతానికి అనకూలంగా వ్యవహిరస్తున్నారని కేంద్ర మంత్రి మురళిధరన్ ఆరోపించారు. శనివారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఏపీలో జగన్ తుగ్లక్ పాలన చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో సర్వమత సమ్మేళనం లేదని, ఒకే మతం కోసం ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఏపీలో శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి మురళిధరన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్పై ఆరోపణలు చేశారు. ఏపీలో సీఎం జగన్ సరైన పాలన అందించడం లేదని అన్నారు. రాజ్యంగబద్ద పదవిలో ఉండి ఒకే మాతాన్ని ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అన్ని మతాలను ఒకేలా చూస్తానని ప్రమాణం చేసిన జగన్ ఇప్పుడు ఆ మాటను తప్పారని ఆరోపించారు. సీఏం హోదాలో ఉండి ఒకే మాతాన్ని ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు.
పథకాల పేర్లు ఎలా మారుస్తారంటూ ప్రశ్న..
కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలని చెప్పి పేరు ఎలా మారుస్తారని కేంద్ర మంత్రి మురళిధరన్ ప్రశ్నించారు. కేంద్ర నిధులు కేటాయిస్తుంటే దానిని రాష్ట్రం ఇస్తున్నట్టు చెప్పుకోవడం సరైంది కాదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మనీ ఆర్డర్ పంపిస్తే, పోస్ట్ మ్యాన్ గా ఉండి డబ్బులు ఇవ్వాల్సిన జగన్.. ఇప్పుడు ఆ డబ్బులు తానే పంపించినట్టుగా చెప్పుకోవడం హ్యాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని అన్నారు. దీనిని బీజేపీ బయటపెట్టి ప్రచారం చేస్తుందని తెలిపారు. ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పార్లమెంట్ లో నిరసన ఎందుకు తెలుపుతున్నారో అర్థం కావడం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్ లో ఎందుకు నిరసనలు తెలుపుతున్నారో తనకు అర్థం కావడం లేదని కేంద్ర మంత్రి అన్నారు. ఈ విషయంలో రెండు పార్టీలు అలాగే వ్యవహరిస్తున్నాయి. బహుశా టీడీపీ, వైఎస్ఆర్సీపీలకు పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగడం ఇష్టం లేదేమో, అందుకే ఇలా ఆందోళనలు చేస్తున్నాయోమో అని వ్యంగంగా మాట్లాడారు.
చంద్రబాబు దారిలోనే జగన్..
ఏపీలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దారిలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా వెళ్తున్నారని మురళిధరన్ అన్నారు. ఇద్దరూ అవినీతి మార్గంలోనే వెళ్తున్నారని ఆరోపించారు. ఇసుక పంపిణీ వ్యవహారంలో, ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో అవినీతి జరిగిందని అన్నారు. రాజ్యంగంపై ప్రమాణం చేసి పదవి చేపట్టిన సీఎం.. ఇప్పుడు ఒక మతానికి అనుకూలంగా ఉంటున్నారని అన్నారు. ఇది సరైన పద్దతి కాదని అన్నారు. ఇక్కడ ఒకే మతం ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.