ఇటీవల వంశపారంపర్య అర్చకులు నలుగురిని తిరిగి నియమిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ నలుగురు  అర్చకులను ముఖ్య అర్చకులుగా నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. 

తిరుమల: ఏడుకొండలపై వెలిసిన కలియుగదైవం వెంకటేశ్వర స్వామిని పూజించే అర్చకులను మూడు రకాలుగా విభజించింది టిడిపి బోర్డు. టీటీడీ అర్చక వ్యవస్థలో మూడు రకాల పోస్టులు ఏర్పాటు చేసింది. ఇకపై ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, అర్చకులు శ్రీవారి సేవలో పాల్గొంటారని ప్రకటించింది. ఇటీవల వంశపారంపర్య అర్చకులు నలుగురిని తిరిగి నియమిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నలుగురు అర్చకులను ముఖ్య అర్చకులుగా నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. 

టిటిడి నిర్ణయంతో గొల్లపల్లి కుటుంబం నుండి గోపీనాధ్ దీక్షతులు, పైడిపల్లి నుండి రాజేష్ దీక్షితులు, పెద్దింటి నుండి రవిచంద్ర దీక్షతులు, తిరుపతమ్మ కుటుంబం నుండి నారాయణ దీక్షితులు ముఖ్య అర్చకులుగా నియమించబడ్డారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

read more జగన్‌ను కలిసిన రమణ దీక్షితులు: తిరుమలలో అన్యమత ప్రచారంపై వ్యాఖ్యలు

ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రమణ దీక్షితులు మంగళవారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల, తిరుపతి దేవస్ధానాల పరిధిలోని తిరుమల వేంకటేశ్వరస్వామి, తిరుపతి గోవిందరాజ స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవార్ల ఆలయాలకు సంబంధించిన 15 మందికి వంశపారంపర్యాన్ని పునరుద్దరించడంపై ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి ప్రసాదాలను సీఎంకు అందజేశారు.

అనంతరం రమణ దీక్షితులు మాట్లాడుతూ.. సంవత్సరాల నుంచి వంశ పారంపర్య అర్చకత్వం కొనసాగుతోందని చెప్పారు. ఇటీవల దానికి అడ్డంకులు ఏర్పడ్డాయని, సీఎం జగన్ దీనిని పునరుద్ధరించారని వెల్లడించారు.

దేవాలయాల్లో నిత్య నైవేద్యాలు, దూపదీపాలకు ఆటంకం లేకుండా కొనసాగించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు రమణ దీక్షితులు తెలిపారు. వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణను సీఎం వైఎస్‌ జగన్‌ రద్దు చేశారని ఆయన వెల్లడించారు.

సీఎం వైఎస్ జగన్ మరిన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి రాష్ట్రంలోని అర్చకులకు మేలు చేయాలని ఆకాంక్షించారు. చెట్టుకి పండ్లు ఉన్నపుడు రాతి దెబ్బలు సహజమని, టీటీడీపై ఆరోపణలు కూడా అలాంటివేనని రమణ దీక్షితులు అభివర్ణించారు. ఎవరు రాజకీయాల్లో ఉన్నా విమర్శ చేస్తూనే ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.