ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ (బుధవారం) కూడా వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

అమరావతి : మధ్యాహ్నం మండుటెండలు... సాయంత్రమైతే వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎండావానలతో సతమతం అవుతున్న తెలుగుప్రజలు మరికొన్ని రోజులు ఈ పరిస్థితిని భరించాల్సి వచ్చేలా కనిపిస్తుంది. రానున్న 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ లో గాలివానలు భీభత్సం సృష్టించే ప్రమాదం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

విదర్భ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరాఠ్వాడా మీదుగా కర్ణాటక వరకు విస్తరించి వుందని... దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా అవి ఇవాళ కూడా కొనసాగవచ్చని తెలిపారు.రానున్న గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం వుందని... ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Read More క్రికెట్ ఆడుతుండగా మైదానంలో పిడుగు... యువకుడు దుర్మరణం, ఇద్దరికి గాయాలు

ఇదిలావుంటే తెలంగాణలో మంగళవారం రాత్రి భారీ వర్షం ముంచెత్తింది. పలు జిల్లాలో సాయంత్రం నుండే ఈదురుగాలులు, వడగళ్ళతో కూడిన వర్షం కురిసింది. దీంతో చేతికందివచ్చిన పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. 

ఇక రాజధాని హైదరాబాద్ లో రాత్రి కురిసిన భారీ వర్షం భీభత్సం సృష్టించింది. దాదాపు రెండుగంటలపాటు ఏకదాటిగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యింది. వేసవి మధ్యలో ఇంత కుండపోత వర్షం కురవడం ఇదే తొలిసారి అని... రెండుగంటల్లో 8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యిందని అధికారులు తెలిపారు. భారీ వర్షానికి రోడ్లన్ని జలమయం కావడంతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు నగరవాసులను భయబ్రాంతులకు గురిచేసింది. 

 ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం ఓ చిన్నారిని బలితీసుకుంది. రహ్మత్ నగర్ డివిజన్ పరిధిలో గోడ కూలి 8 నెలల చిన్నారి ప్రాణాలు కొల్పోయింది. ఇక నగరంలో చెట్లకొమ్మలు, హోర్డింగ్ లు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.