క్రికెట్ ఆడుతున్న విద్యార్థులపై పిడుగు : ఇద్దరు మృతి
విశాఖ జిల్లా అనకాపల్లిలో విషాదం
సరదాగా సాయంత్ర సమయంలో క్రికెట్ ఆడుతున్న విద్యార్థులను మృత్యువు పిడుగు రూపంలో వెంటాడింది. అప్పటి వరకు ప్రశాంతంగా వున్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం మొదలవడంతో క్రికెట్ ఆడుతున్న విద్యార్థులంతా చెట్టు కిందకి చేరుకున్నారు. అయితే అదే చెట్టుపై రాకాసి పిడుగు పడటంతో ఇద్దరు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.
అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామంలోని మైదానంలో సాయంత్రం సమయంలో విద్యార్థులంతా కలిసి క్రికెట్ ఆడుతున్నారు. అయితే ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి వర్షం ప్రారంభమైంది. భారీగా మెరుపులు,ఉరుములతో కూడిన వర్షం కావడంతో విద్యార్థులంతా క్రికెట్ ఆపేసి పరుగులు తీశారు. వీరిలో కొంతమంది గ్రౌండ్ కు దగ్గరున్న టేకు చెట్టు వద్దకు వెళ్లి తడిచిపోకుండా దాని కింద నించున్నారు.
అయితే ఇదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో ఇద్దరు విద్యార్థులు కుప్పకూలిపోయారు. మరికొంతమంది విద్యార్థులకు చిన్న చిన్న గాయాలయ్యాయి. దీంతో అందరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే నడిశెట్టి పవన్కుమార్, హేమంత చంద్రశేఖర్ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.
మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అనకాపల్లి పోలీసులు ఈ స:ఘటనపై సమాచారం సేకరించామని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.