శ్రీకాకుళంలో ముగ్గురి ప్రాణాలు తీసిన బైక్ రేస్
శ్రీకాకుళం జిల్లాలో బైక్ రేసింగ్ ముగ్గురి ప్రాణాలను తీసింది. శ్రీకాకుళం జిల్లా గారపేట మండలం చల్లపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకొంది.ఈ కేసు విచారణలో పోలీసులు ఆసక్తికర విషయాలను తెలుసుకొన్నారు.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో బైక్ రేసింగ్ ముగ్గురి ప్రాణాలను తీసింది. శ్రీకాకుళం జిల్లా గారపేట మండలం చల్లపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకొంది.ఈ కేసు విచారణలో పోలీసులు ఆసక్తికర విషయాలను తెలుసుకొన్నారు.
ఈ నెల 8వ తేదీన హిమశేఖర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బైక్ రేసింగ్ నిర్వహించారు.ఈ బైక్ రేసులో హిమ శేఖర్ తో పాటు ఆయన స్నేహితుడు తేజ మరణించారు. వీరిద్దరితో పాటు కూరగాయల వ్యాపారి దామోదర శ్రీనివాస్ కూడ ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.
హిమశేఖర్ గ్యాంగ్ పార్క్ చేసిన టూ వీలర్ల నుండి పెట్రోల్ దొంగిలించి జల్సాలు చేసుకొనేవారు. ఈ నెల 8వ తేదీన హిమశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని పలు పార్క్ చేసిన వాహనాల నుండి పెట్రోల్ను సేకరించి ఆ పెట్రోల్ ను విక్రయించి జల్సాలకు పాల్పడ్డారు.
అంతేకాదు శ్రీకాకుళం పట్టణంలోని వాంబే కాలనీలో ఓ కోడిని దొంగిలించారు. అయితే శ్రీకాకుళం నుండి కళింగ పట్టణం వరకు బైక్ రేస్ లో ఎవరైతే ముందుగా చేరుకొంటారో.. వారికే ఈ కోడి దక్కుతోందని స్నేహితులు పందెం కాశారు.
రెండు బైకులపై హిమశేఖర్ అతని స్నేహితులు బైక్ రేసింగ్లో పాల్గొన్నారు.హిమ శేఖర్ తన బైక్పై తేజను కూర్చొబెట్టుకొన్నారు. బైక్ రేసింగ్ లో పాల్గొన్న సమయంలో ప్రమాదవశాత్తు కూరగాయల వ్యాపారి దామోదర శ్రీనివాసరావును ఢీకొట్టారు.
దీంతో హిమశేఖర్, తేజ అక్కడికక్కడే మృతి చెందారు. రిమ్స్లో చికిత్స పొందుతూ దామోదర శ్రీనివాసరావు కూడ మరణించారు.సుమారు 15 మంది ఓ గ్యాంగ్గా ఏర్పడి పెట్రోల్ను దొంగిలించి విక్రయిస్తున్నారు. రాత్రి పూట బైక్ రేసింగ్లకు పాల్పడేవారని పోలీసులు గుర్తించారు.
హిమశేఖర్ స్నేహితుల్లో ఇప్పటికే కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సుమారు ఆరుగురు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.