కడపలో పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న హత్య కేసు.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు..
కడపలో పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు.
కడపలో పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. ఏడీ సుభాష్ చంద్రబోస్, కలసపాడుకు చెందిన చెన్న కృష్ణ, గుర్రంకొండకు చెందిన బాలజీ నాయక్ను అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. జీతం రాకుండా చేసి ప్రభుత్వానికి సరెండర్ చేశారనే కక్షతో చంద్రబోస్ ఈ హత్యకు ప్లాన్ చేసినట్టుగా తెలిపారు. ఈ నెల 12న అచ్చెన్న చర్చిలో ప్రార్థన చేసి వస్తుండగా కిడ్నాప్ చేశారని చెప్పారు. అనంతరం కారులో గువ్వల చెరువు ఘాట్ వద్దకు తీసుకెళ్లారని.. అక్కడే అచ్చెన్నకు చంపారని తెలిపారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించామని చెప్పారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
ఇక, అచ్చన్న కడపలోని బహుళార్థ పశు వైద్యశాలలో ఉపసంచాలకుడుగా పనిచేస్తున్నారు. అయితే అచ్చెన్న కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అచెన్న కనిపించకుండా పోయిన 12 రోజుల తర్వాత ఆయన మృతదేహం అనుమానాస్పద స్థితిలో వెలుగు చూసింది. సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఇలా జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ దళితుడు, ప్రభుత్వ అధికారి కనిపించకుండా పోయాడనే ఫిర్యాదు ఇచ్చిన పోలీసులు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అచ్చన్న మృతదేహం లభించిన తర్వాత పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. పోస్టుమార్టం చేయించేసి మృతదేహాన్ని ఆ తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ క్రమంలోనే అచ్చెన్నకు తాను పనిచేసేచోట సహాయ సంచాలకులుగా పని చేసే శ్రీధర్ లింగారెడ్డి, సురేంద్రనాథ్ బెనర్జీ, సుభాష్ చంద్రబోస్ లకు మధ్య తగాదాలు ఉన్నాయి. గత ఆరు నెలలుగా వీరి మధ్య గొడవలు నడుస్తున్నాయని తెలుస్తోంది.