ఈ ఏడాది శ్రీకాకుళంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: ఏపీ సీఎస్
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు శ్రీకాకుళం ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ మీడియాకు వివరాలు తెలిపారు
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు శ్రీకాకుళం ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ మీడియాకు వివరాలు తెలిపారు. ఇందుకు సంబంధించి విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు.. స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని.. వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై మరింత అవగాహన కలిగించేందుకు శకటాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు.
అలాగే పంద్రాగష్టు వేడుకలను రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నందున కార్యక్రమానికి వచ్చే రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పశు సంవర్థక శాఖలకు సంబంధించిన శకటం, సమాచార పౌరసంబంధాలు, సీఆర్డీఏ, విద్య, అటవీ, వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం, గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్, సెర్ప్ (సాధికార మిత్ర), సాంఘిక, గిరిజన, మహిళా శిశు సంక్షేమం, పర్యాటక, సాంస్కృతిక శాఖలతో పాటు నీటి వనరుల శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై శకటాలను ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు.