వాటర్ ట్యాంకుపై టెట్ అభ్యర్ధుల నిరసన: ఆవనిగడ్డలో ఉద్రిక్తత
ఆవనిగడ్డలో టెట్ అభ్యర్ధుల నిరసన
విజయవాడ: కృష్ణా జిల్లా ఆవనిగడ్డలో ఆదివారం నాడు ఉద్రిక్తత నెలకొంది. టెట్ పరీక్షను రద్దు చేయాలంటూ ఆవనిగడ్డలో వాటర్ ట్యాంక్ ఎక్కి పీఈటీ అభ్యర్ధులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం నుండి స్పష్టమైన హమీ ఇస్తేనే తాము తమ ఆందోళనను విరమిస్తామని అభ్యర్ధులు ప్రకటించారు.
టెట్ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకొంటున్నాయని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో ఈ పరీక్షలను రద్దు చేయాలని పీఈటీ అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు. పీఈటీ అభ్యర్థుల నుంచి వేల రుపాయలు వసూలు చేసి పేపర్ లీకేజీ చేయించేందుకే ఏర్పాట్లు చేశారని కొందరు అభ్యర్ధులు ఆరోపించారు.
దీనిపై విచారణ జరిపించాలని పీఈటీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.అయితే ఆందోళన చేస్తున్న అభ్యర్ధులను వాటర్ ట్యాంకు దిగాలని కోరుతున్నారు.