విశాఖలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు, ఉద్రిక్తత
టీడీనీ, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాల మధ్య విశాఖలో టెన్షన్ నెలకొంది. జాతీయ రహదారుల విస్తరణ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు విశాఖ బీచ్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకొంది.
విశాఖపట్టణం: విశాఖపట్టణంలో శుక్రవారం సాయంత్రం టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య పోటాపోటీ నినాదాలలతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విశాఖ బీచ్ రోడ్డులో జాతీయ రహదారుల విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకొంది.
కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విశాఖపట్టణంలోని బీచ్ రోడ్డు వద్ద జాతీయ రహదారుల విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు వచ్చిన సమయంలో విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు.
ఆ తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాన్వాయ్ వచ్చింది. ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. రెండు పార్టీలకు చెందిన కార్యర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఇరువర్గాలను సముదాయించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.మరో వైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకుగాను పోలీసులు భారీగా మోహరించారు.