క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న ప్రచారం బాగా జరుగుతుండటంతో అభ్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయ్.

మూడు జిల్లాల్లో హై టెన్షన్. ఈనెల 19వ తేదీన జరుగనున్న ఎంఎల్సీ ఎన్నికల్లో గెలవటం ఇరు పార్టీలకు ప్రతిష్టగా మారిపోయింది. దాంతో అభ్యర్ధులే కాకుండా నేతల్లో కూడా టెన్షన్ పెరిగిపోతోంది. ఏ నిముషంలో ఏ ఓటరు చేజారిపోతారోనన్న భయం ఇరు పార్టీల్లోనూ కనబడుతోంది. క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న ప్రచారం బాగా జరుగుతుండటంతో అభ్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయ్. స్ధానిక సంస్ధల కోటా ఎంఎల్సీ ఎన్నికలు కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో జరుగుతున్నాయి.

ఓటర్లను కాపాడుకోవటంలో భాగంగా ఇప్పటికే రెండు పార్టీలూ కోట్ల రూపాయలను మంచినీళ్ళులాగ ఖర్చుపెట్టాయి. ఆ మాటకొస్తే కడప జిల్లాలో మంచినీళ్ళే బాగా ఖరీదనుకోండి అదివేరే సంగతి. మూడు జిల్లాల్లో కడప, కర్నూలు పూర్తి ఫ్యాక్షన్ జిల్లాలవటం, ఇక్కడ మెజారిటీ వైసీపీకే ఉండటంతో ఏ క్షణంలో ఏమవుతుందోనని సామాన్య జనాల్లో కూడా టెన్షన్ మొదలైంది. రెండు పార్టీలూ తమ ఓటర్లను కాపాడుకోవటంలో భాగంగా దేశంలో ఎక్కడెక్కడో క్యాంపులు కూడా నిర్వహింస్తున్నారు. శనివారం సాయంత్రానికి ఓటర్లందరూ తమ జిల్లాలకు చేరుకోవచ్చని సమాచారం.

ఈ నేపధ్యంలో చంద్రబాబు మూడు జిల్లాల్లోని అభ్యర్ధులను గెలిపించే బాధ్యత మంత్రులు, ఎంఎల్ఏ, ఎంపిలకు అప్పగించారు. అందులోనూ ఫిరయింపు ఎంఎల్ఏలు బాగా ఉత్సాహంగా ఉన్నారు. కడప జిల్లాలో వర్గ రాజకీయాలు దెబ్బతీస్తాయోమోనని టిడిపి నేతల్లో ఆందోళన కనబడుతోంది. కర్నూలు జిల్లా నంద్యాల ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి హఠాన్మరణం టిడిపికి ఇబ్బందే. అదేసమయంలో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి వైసీపీ అభ్యర్ధి గౌరు వెంకట్రెడ్డికి మద్దతు ప్రకటించటంతో వైసీపీ జోరుమీదుంది. ఇక, నెల్లూరులో పోటీ నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. కాకపోతే టిడిపిలో అక్కడా వర్గ రాజకీయాలు కావల్సినంత ఉన్నాయి. దాంతో అక్కడ కూడా నేతల్లో ఆందోళన కనబడుతోంది.