యూపీఎస్సీ (UPSC) విడుదల చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్  (IFS‌) ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తాచాటారు. ఈ  ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్‌ ఆలిండియా టాపర్‌గా నిలిచాడు.  

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రకటించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్  (IFS‌) ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తాచాటారు. ఐఎఫ్‌ఎస్‌ 2022 ఫలితాలను యూపీఎస్సీ శనివారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొదటి ర్యాంక్‌తో సహా టాప్ ర్యాంక్‌లు తెలుగు విద్యార్థులు సాధించారు. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ టాపర్‌గా నిలవగా, హైదరాబాద్‌కు చెందిన పన్నాల సాహితీరెడ్డి 48వ ర్యాంకు, తొగరు సూర్యతేజ 66వ ర్యాంకులు సాధించారు.

ఈ సందర్భంగా  శ్రీకాంత్‌తో మీడియాతో మాట్లాడుతూ తన సక్సెస్ సోర్టీ పంచుకున్నారు. తాను పరీక్షకు స్వయంగా సిద్ధమయ్యానని తెలిపారు. కేవలం అప్షన్ పేపర్ – జియాలజీకి కోచింగ్ తీసుకున్నాననీ. మిగిలిన సబ్జెక్టులకు స్వయంగా ప్రిపేర్ అయ్యానని తెలిపారు. చివరి ప్రయత్నంలో ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయాను. ప్రకృతి పట్ల నాకున్న ప్రేమ నన్ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌లో చేరేలా చేసిందని తెలిపారు. 

హైదరాబాద్‌కు చెందిన సాహితీ రెడ్డి , తన తల్లిదండ్రులు ఇద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే.. వారే తనను సివిల్ సర్వీసెస్‌లో చేరేలా ప్రేరేపించారని , స్ఫూర్తినిచ్చారని చెప్పారు. తాను BITS-Pilani నుండి ECEలో BTech చేసాననీ, ఆ తరువాత రెండు సంవత్సరాలు పనిచేశాననీ, కోర్సు పని సమయంలో నేను సివిల్ సర్వీసెస్‌ను క్రాక్ చేయాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పింది.

సూర్య తేజ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ , తెలంగాణ శాసనసభ చీఫ్ మార్షల్ టి కరుణాకర్ కుమారుడు. అతను IIT ఇండోర్ నుండి టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. IIM బెంగళూరు నుండి MBA పొందాడు. తేజ సాధించిన విజయానికి తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అభినందనలు తెలిపారు. 

కాగా గత ఏడాది నవంబర్‌ 20 నుంచి 27 వరకు ఐఎఫ్ఎస్‌ రాత పరీక్ష నిర్వహించగా, ఈ ఏడాది జూన్‌లో ఇంటర్వ్యూలను పూర్తి చేసిన యూపీఎస్సీ ఇవాళ తుది ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా  నియామకం కోసం 147 మంది అభ్యర్థులను, తాత్కాలిక కేటగిరీ కింద మరో 12 మంది అభ్యర్థులను కమిషన్ సిఫార్సు చేసింది. మొత్తం 150 ఖాళీలను రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కమిషన్‌కు నివేదించింది.