Asianet News TeluguAsianet News Telugu

హైరిస్క్ ప్రాంతంగా తెలంగాణ...: ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 

Telangana  is high risk: Andhra pradesh Govt
Author
Amaravathi, First Published Jul 13, 2020, 8:22 PM IST

అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల కలెక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలిచ్చింది. తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్కు ప్రాంతాలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు  జారీ చేసింది. గతంలో ఈ రెండు రాష్ట్రాలను లోరిస్కు ప్రాంతాలుగా పేర్కొన్న విషయం తెలిసిందే. 

ప్రస్తుతం కేసుల సంఖ్య తీవ్రస్థాయికి చేరటంతో ఈ రెండు రాష్ట్రాలను హైరిస్కు ప్రాంతాలుగా గుర్తించింది. విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం విధించే 7 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని పేర్కొంది. గల్ఫ్ నుంచి వచ్చిన వారికి 14 రోజుల క్వారంటైన్ 7 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.  విదేశాల నుంచి ఏపీకి తిరిగివచ్చి క్వారంటైన్ లో ఉన్న వారికి 5 రోజు, 7రోజున కోవిడ్ టెస్టు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల నుంచి 10 శాతం మందిని గుర్తించి ర్యాండమ్ గా కరోనా టెస్టు చేయాలని ఆదేశించింది. విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేయాల్సిందిగా సూచనలు జారీ చేసింది. వారందరికీ 14 రోజుల హోమ్ క్వారంటైన్ వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేసింది. 

read more  ఏపీలో ఒక్క రోజులో 2 వేలకు చేరువలో కరోనా కేసులు: 36 మరణాలు

రైళ్ల ద్వారా ఏపీకీ వచ్చే వారిలోనూ ర్యాండమ్ గా టెస్టులు చేయాలని... 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేయాల్సిందిగా ఆదేశించింది. రహదారి మార్గం ద్వారా ఏపీలోకి ప్రవేశించే చోట బోర్డర్ చెక్ పోస్టుల వద్దే స్వాబ్ టెస్టులు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.  తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికులకు 14 రోజుల హోమ్ క్వారంటైన్ చేయాల్సిందిగా ఆదేశించారు. 

ఏపీకి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా  ఇ-పాస్ కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తులను తక్షణం వేరు పరిచి కోవిడ్ ఆస్పత్రులకు తరలించాలని సూచించింది. హోమ్ క్వారంటైన్ చేసిన వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఏఎన్ఎం లు, గ్రామ వార్డు వాలంటీర్, సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈమేరకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి పేరిట ఆదేశాలు వెలువడ్డాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios