మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరిని సీబీఐ అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. 

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరికి అప్రూవర్ హోదా కల్పించిన సీబీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వివేకానందరెడ్డి మాజీ పీఏ ఎంవీ కృష్ణారెడ్డి, వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా దస్తగిరిని అప్రూవర్‌గా మార్చొద్దని భాస్కరరెడ్డి, కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 

ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని దస్తగిరికి నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను హైకోర్టు జూన్ మూడో వారానికి వాయిదా వేసింది. 

Also Read: చంద్రబాబు‌కు వైసీపీ ఎంపీ బర్త్ డే విషెస్.. నెటిజన్ల ప్రశ్నలు.. జగన్ చేసిన ట్వీట్‌తోనే కౌంటర్..

ఈ పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా 2019 మార్చిలో పులివెందులలో వివేకానందరెడ్డిని హతమార్చిన గొడ్డలిని దస్తగిరి కొనుగోలు చేశారని చెప్పేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కృష్ణారెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వివేకానందరెడ్డిపై దాడి చేసి హత్య చేసిన నలుగురిలో దస్తగిరి ఒకడని చెప్పారు. అయినప్పటికీ సీబీఐ దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడానికి అనుమతించిందని.. బెయిల్ పొందడానికి సహాయపడిందని అన్నారు. వాచ్‌మెన్ రంగయ్య హంతకులందరినీ గుర్తించాడని.. వారిలో దస్తగిరి ఒకరని తెలిపారు. ఇక, భాస్కర్ రెడ్డి కూడా దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన కూడా ఇదే రకమైన అభ్యర్థన చేశారు. 

అయితే దస్తగిరికి ట్రయల్‌ కోర్టు ఇచ్చిన అప్రూవర్‌ హోదాను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను సీబీఐ వ్యతిరేకించింది. ఈ విషయంలో పిటిషనర్లకు లోకస్‌ స్టాండియే లేదని కోర్టుకు తెలిపింది. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలమే తమ సాక్ష్యం అని చెప్పడం సరికాదని.. ఇతర ఆధారాలను కూడా సేకరించామని సీబీఐ కోర్టుకు తెలిపింది.