Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కరెంటు కోత.. రెండు థర్మల్ యూనిట్లలో సాంకేతిక లోపం..

ఏపీ జెన్ కోకు చెందిన కృష్ణపట్నం 800 మెగావాట్లు, విజయవాడ విటిపిఎస్ లో 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. బాయిలర్ ట్యూబ్ లో లీకేజీ రావడంతో  గురువారం ఉదయం నుంచి  ప్లాంట్లలో నిలిచిపోయింది. ఇదే సమయంలో విశాఖలోని  సింహాద్రి థర్మల్ ప్లాంట్ నుంచి  400 మెగావాట్ల ఉత్పత్తి కూడా నిలిచింది.  

Technical fault in two thermal units, Power cut in AP
Author
Hyderabad, First Published Feb 4, 2022, 7:09 AM IST | Last Updated Feb 4, 2022, 7:09 AM IST

అమరావతి :  రాష్ట్రంలోని రెండు thermal power plantsలో Technical errors తలెత్తడంతో Power generationకి అంతరాయం ఏర్పడింది. దీంతో లోడ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫాల వారీగా విద్యుత్ సరఫరాలో cut పెట్టారు. ప్రతి గ్రామానికి కనీసం 1-2 గంటల పాటు రొటేషన్ పద్ధతిలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పాటు..  పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకూ కోతలు విధించారు.

AP Gen Coకు చెందిన కృష్ణపట్నం 800 మెగావాట్లు, విజయవాడ విటిపిఎస్ లో 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. బాయిలర్ ట్యూబ్ లో లీకేజీ రావడంతో  గురువారం ఉదయం నుంచి  ప్లాంట్లలో నిలిచిపోయింది. ఇదే సమయంలో విశాఖలోని  సింహాద్రి థర్మల్ ప్లాంట్ నుంచి  400 మెగావాట్ల ఉత్పత్తి కూడా నిలిచింది.  

ఈ కారణంగా గ్రిడ్ కు వచ్చే సుమారు 1,700 మెగావాట్లు తగ్గింది.  ఇదే సమయంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ సుమారు 194 మిలియన్ యూనిట్లుగా ఉంది. డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో కోతలు విధించక తప్పలేదు. పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకు కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. లోడ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో రొటేషన్ విధానంలో కోతలు పెట్టారు. దీనికితోడు కడప ఆర్టీపీపీలో 210 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడో యూనిట్, విటిపిఎస్ లో 210 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మొదటి యూనిట్ నిర్వహణ కోసం ఉత్పత్తి నిలిపివేశారు.  దీంతో డిమాండ్ మేరకు సర్దుబాటు సాధ్యం కాలేదు.

ఎన్నికల ప్రభావంతో దొరకని విద్యుత్..
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 194  ఎంయూలు కాగా థర్మల్ యూనిట్లలో సాంకేతిక లోపంతో సుమారు 5-6 ఎంయూల లోటు ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు బహిరంగ మార్కెట్లో కొనుగోలుకు ప్రయత్నించినా యూనిట్ 15 రూపాయల వరకు ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అధిక ధర వెచ్చించి అక్కడి ప్రభుత్వాలు కొంటున్నాయి. ఎక్కువ ధర చెల్లించి కొనేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

వివిధ జిల్లాల్లో కోతలు
- ప్రకాశం జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల సాయంత్రం నాలుగు నుంచి రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల రెండు గంటల పాటు కరెంటు తీసేశారు.

- శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చాలాచోట్ల సాయంత్రం 5 నుంచి, కొన్ని ప్రాంతాల్లో 5:30 నుంచి కరెంటు తీశారు. రాత్రి 8-9 గంటల వరకు రాలేదు.

- విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ రెండు గంటలకు పైగా తీసేశారు.

- తూర్పుగోదావరి జిల్లాలో పలు మండలాల్లో విద్యుత్ కోతలు విధించారు. కాకినాడ నగరం, గ్రామీణ మండలాల్లో  సాయంత్రం 6 గంటల నుంచి రెండు గంటల పాటు కరెంటు లేదు.

- నెల్లూరు, కృష్ణ, గుంటూరు, రాయలసీమలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోత విధించారు.

సాంకేతిక సమస్యతో  కొరత
ఎన్టీపీసీలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా గురువారం 800 మెగావాట్ల కొరత తలెత్తిందని, అందుకే ఐదు జిల్లాల పరిధిలో విద్యుత్ కోతలు విధించాల్సి వచ్చిందని ఈపీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు తెలిపారు. అయితే, తమ పరిధిలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని ఎన్టీపీసీ వర్గాలు తెలిపాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios