టీడీపీ అభ్యర్థుల రెండో లిస్ట్ రెడీ! రేపు ప్రకటిస్తాం: చంద్రబాబు నాయుడు
టీడీపీ రేపు అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించనుంది. 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. తొలి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే.
TDP: ఏపీలో విపక్షాల మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటు, ఏ సీటులో ఎవరు బరిలో ఉండాలనే విషయమై ఇంకా జనసేన, బీజేపీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కాగా, టీడీపీ మాత్రం వారికి సీట్లను కేటాయించి తమ సొంత సీట్లలలో అభ్యర్థులను ప్రకటిస్తున్నది. బీజేపీతో పొత్తు కంటే ముందే తొలి జాబితాను ప్రకటించిన టీడీపీ ఇప్పుడు రెండో జాబితాను విడుదల చేయడానికి సిద్ధమైంది. రేపు రెండో జాబితాను ప్రకటిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అభ్యర్థుల కసరత్తు తుది దశకు వచ్చిందని వివరించారు.
ఇక జనసేన, బీజేపీ ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో వారికి స్పష్టత ఉన్నదని చంద్రబాబు నాయుడు తెలిపారు. వారికి అనుకూలమైన సమయంలో ఆ రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటిస్తాయని వివరించారు. ఈ పొత్తు ప్రజల కోసమే పెట్టుకున్నామని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పొత్తు ఎందుకు పెట్టుకున్నట్టు? అనే ఆలోచనలు చేయరాదని పేర్కొన్నారు.
Also Read : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియోజకవర్గం నుంచి లోక్ సభ ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం
టీడీపీ రేపు 25 నుంచి 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. అసెంబ్లీ స్థానాలతోపాటు పలు లోక్ సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. తొలి విడతలో టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.