ఫేక్ ఎమ్మెల్యే ఆర్కే సీఐడీ ఫిర్యాదు ఫేకే...ఈ మహిళ మాటలే సాక్ష్యం..: నారా లోకేష్ (వీడియో)
దళితుల పేరిట మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఐడికి తప్పుడు సమాచారమిచ్చారని మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.
అమరావతి: అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సిఐడికి అందిన ఫిర్యాదులు ఫేక్ అని తాజాగా టిడిపి చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ లో తేలిందని మాజీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. దళితుల పేరిట మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఐడికి తప్పుడు సమాచారమిచ్చారని... అధికారం అండతో అమరావతిపై కుట్ర పన్నారని లోకేష్ ఆరోపించారు.
''నిజమేంటో జనానికి తెలిసేసరికి, జగన్రెడ్డి సృష్టించిన అబద్ధాలు ప్రపంచం చుట్టి వస్తున్నాయి. అసత్యప్రచారమే పెట్టుబడిగా తెచ్చుకున్న అధికారం అండతో అమరావతిపై పన్నిన మరో కుట్రని తెలుగుదేశం బట్టబయలు చేసింది'' అని లోకేష్ ట్వీట్ చేశారు.
''ఫేక్ సీఎం ఆదేశాలతో, ఫేక్ ఎమ్మెల్యే ఆర్కే అసైన్డ్ రైతుల పేరుతో, సీఐడీకి ఫేక్ ఫిర్యాదు ఇచ్చారని ఆధారాలతో సహా బయటపెట్టాం. ఇప్పటికైనా ప్రజా రాజధాని అమరావతిపైనా, టిడిపిపైనా కుతంత్రాలు ఆపండి'' అని హెచ్చరించారు.
''అందరి ఆమోదంతో, రైతుల త్యాగాల పునాదులపై నిలిచిన ప్రజారాజధానిపై విద్వేషంతో అమరావతి విధ్వంసానికి ప్రయత్నించిన ప్రతీసారీ న్యాయమే గెలుస్తుంది. నీ అసత్యపు కుట్రలు బట్టబయలవుతూనే వుంటాయి'' అని లోకేష్ పేర్కొన్నారు.