ఈనెల 14న వైసిపిలో చేరనున్న టిడిపి నేత: చంద్రబాబుకు షాక్
టిడిపిలో సీనియర్ నేత యలమంచిలి రవి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈనెల 14వ తేదీన వైసిపిలో చేరుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో పాదయాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డితో రవి భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని పెద్ద వడ్లపూడి బస చేసిన జగన్ తో రవి భేటీ అయ్యారు. రవి గతంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పిఆర్పి తరపున ఎంఎల్ఏగా గెలిచారు.
2014లో టిడిపిలో చేరిన రవిని పార్టీ అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న రవి వైసిపిలో చేరుతున్నట్లు చంద్రబాబు గ్రహించారు. అందుకనే పోయిన నెలలో చంద్రబాబు తరపున ఓ మంత్రి, ఓ ఎంపి రవితో భేటీ అయ్యారు. వెంటనే చంద్రబాబు వద్దకు తీసుకెళ్ళారు.
దాంతో ఇద్దరి మధ్య భేటీ జరిగిన తర్వాత తాను టిడిపిలోనే కొనసాగుతున్నట్లు చెప్పారు. కానీ ఇంతలో ఏమైందో ఏమో? సోమవారం సాయంత్రం జగన్ తో పెద వడ్లపూడిలో భేటీ అయ్యారు. జగన్-రవి మధ్య సుమారు అర్ధగంటపాటు భేటీ జరిగింది. విజయవాడలో జగన్ పాదయాత్ర మొదలుపెట్టే రోజే రవి వైసిపిలో చేరుతున్నారు. అదే సందర్భంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా రవి ప్లాన్ చేస్తున్నారు.
బహుశా వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసే విషయంపైనే చర్చ జరిగి ఉంటుందని పార్టీ నేతలంటున్నారు
అయితే జగన్ నుండి రవికి ఏ విధమైన హామీ వచ్చిందీ అన్న విషయంలో స్పష్టత లేదు.