రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన వీడియో ప్రజంటేషన్‌పై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కౌంటర్ ఎటాక్ చేశారు

రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన వీడియో ప్రజంటేషన్‌పై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కౌంటర్ ఎటాక్ చేశారు. భూములు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారంటే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాజధానికి కూతవేటు దూరంలోనే వైసీపీ నేతలు భూములు ఎలా కొనుగోలు చేశారని నరేంద్ర నిలదీశారు. సీఎం వైఎస్ జగన్ సతీమణీ, భారతి పేరు మీద కూడా భూములు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. అంటే వైసీపీ నేతలు కూడా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లే కదా అన్నారు.

Also Read:జగన్ చేతిలో అమరావతి భవితవ్యం: సర్కార్‌కు బోస్టన్ నివేదిక

తాడేపల్లిలోని మూడెకరాల్లో జగన్ కోసం బిల్డింగ్ కట్టారని... మేం తప్పు చేస్తే ఏ విచారణకైనా సిద్ధమని ధూళిపాళ్ల స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశారని... ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా విచారణ చేపట్టాలంటూ ఆయన హితవు పలికారు.

రాజధాని మార్చాలనే ఆలోచనతోనే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని నరేంద్ర మండిపడ్డారు. తాను రాజధానిలో 2016లోనే భూములు కొనుగోలు చేశానని.. జగన్ ఇల్లు కట్టిన లే ఔట్‌కు అనుమతి ఉందా అని ధూళిపాళ్ల నిలదీశారు.

Also Read:అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్: వైసీపీకి బొండా ఉమా సవాల్ ఇదీ

అనధికార లేఔట్‌లో ముఖ్యమంత్రి నివాసం ఉంటున్నారని.. అనుమతి లేని ప్రాంతంలో ఉన్న జగన్ ఇల్లూ కూల్చుతారా అని ఆయన సవాల్ విసిరారు. జగన్ ఇల్లు కోసం భూములు సేకరించిన వాళ్లు కూడా ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసినట్లే కదా అని ధూళిపాళ్ల మండిపడ్డారు.

భూములపై విచారణ జరిపితే వైఎస్ భారతి, సండూర్ కంపెనీలపైనా చేయాలని నరేంద్ర సవాల్ విసిరారు. తమపై ఎలాంటి విచారణైనా చేసుకోవచ్చని... ప్రజలను మాత్రం బలి పశువులను చేయొద్దని ఆయన కోరారు.