జోనికుమారి ఆత్మహత్యాయత్నం...ఆ బాధ్యత సీఎందే: ఎంఎస్ రాజు హెచ్చరిక
జగన్రెడ్డి పై అభిమానంతో ఆయనకు ఓటేసిన దళితులు ఇప్పుడు అదే ఫ్యాన్కి ఉరేసుకుని చావాల్సిన దయనీయ పరిస్థితులు దాపురించాయని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు.
గుంటూరు: జగన్రెడ్డి పై అభిమానంతో ఆయనకు ఓటేసిన దళితులు ఇప్పుడు అదే ఫ్యాన్కి ఉరేసుకుని చావాల్సిన దయనీయ పరిస్థితులు దాపురించాయని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ పార్టీ అగ్రనేతలు మోసం చేయడంతో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షురాలు జోని కుమారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం రాష్ట్రంలో దళితుల దుస్థితికి అద్దం పడుతోందంటూ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోనికుమారికి ఏమైనా జరిగితే సీఎం జగన్రెడ్డిదే బాధ్యత అని రాజు హెచ్చరించారు.
ఓటు వేసిన దళితులూ దగాకు గురయ్యారనీ, నమ్మి వెంట తిరిగిన దళిత నేతలను నట్టేట ముంచారని రాజు ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల అభ్యున్నతికి బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి తన తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ అన్నివర్గాలను అధ:పాతాళంలోకి తొక్కేస్తున్నారని మండి పడ్డారు.
జగన్రెడ్డి అధికారం చేపట్టిన ఏడాది కాలంలో దళితులకు తీరని అన్యాయం చేశారన్నారు. దళిత న్యాయమూర్తి రామకృష్ణను బూటుకాలితో తన్ని, దాడిచేసి, చెప్పుకోలేని విధంగా దూషించినా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్కుల్లేవని అడిగినందుకు నర్సీపట్నం ఆస్పత్రిలో దళిత డాక్టర్ సుధాకర్ని వెంటాడి వేధించి చంపేందుకు ప్రయత్నించడం జగన్రెడ్డి అరాచకానికి పరాకాష్టగా నిలిచిందన్నారు.
read more నన్నెవరూ బతికించొద్దు.. అంటూ లైవ్ లో విషం తాగిన వైసీపీ మహిళా కార్యకర్త..
దళిత వైద్యురాలు డాక్టర్ అనితారాణికి ఏకంగా మంత్రుల నుంచే వేధింపులు రావడం దళితుల పట్ల ఈ ప్రభుత్వ వైఖరి తేటతెల్లం అవుతోందన్నారు. దళితుల పట్ల ఎందుకిలా ప్రవర్థిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డిని మీడియా నిలదీస్తే, దళిత వైద్యులు, డాక్టర్లు, న్యాయమూర్తులను ఆడు ఈడంటూ అత్యంత నీచంగా మాట్లాడటం అగ్రకుల దురంహకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కచ్చులూరులో బోటు మునిగి 56 మంది జలసమాధి అవడం వెనుక కుట్ర కోణాలను వెలికి తీసిన దళితనేత, మాజీ ఎంపీ హర్షకుమార్ని బెయిల్ రాకుండా జైళ్లలో నిర్బంధించడం జగన్రెడ్డి దళితులపై కక్ష కట్టారనే దానికి మరో ఉదాహరణ అని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను తన పబ్లిసిటీకి వాడుకున్న జగన్రెడ్డి దళితులకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
దళితులు తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములపై వైసీపీ పెద్దలు గద్దల్లా వాలిపోతున్నారని ఆరోపించారు. దళితుల నుంచి 3వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కుని సర్కారు తీరని అన్యాయం చేసిందన్నారు. టీడీపీ హయాంలో లిడ్ క్యాప్ లెదర్ ఇండస్ట్రీకి కేటాయించిన 800 ఎకరాల్ని దురాక్రమణకి పావులు కదుపుతుండటం దళితుల్ని దగా చేయడమేనని ఎంఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.