నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తమ పార్టీలోకి రావాలని టీడీపీ నాయకులు కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. తమ నియోజకవర్గంలో లోకేష్ యువగళం పాదయాత్రను విజయవంతం చేస్తానని హామీ ఇచ్చారు.
గత కొంత కాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి టీడీపీ ఆహ్వానం పలికింది. తమ పార్టీలోకి చేరాలని కోరింది. ప్రస్తుతం టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నది. ఈ క్రమంలో మంగళవారం టీడీపీ నాయకుడు బి.రవిచంద్ర తో పాటు పలువురు నాయకులు కోటంరెడ్డిని కలిశారు. ఆ సందర్భంగా పార్టీలోకి రావాలని కోరారు.
సీఎంను విమర్శిస్తున్నా పవన్ కల్యాణ్ పై ఆ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు నో కామెంట్స్..కారణమదేనా ?
ఈ ఆహ్వానం పట్ల ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆహ్వానాన్ని తాను అంగీకరిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీతో తాను కొంత కాలం నుంచి దూరంగా ఉంటున్నానని, ఇలాంటి సందర్భంలో తనను పార్టీలోకి ఆహ్వానించినందుకు టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ కు ఆయన కృతజ్ఞత తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లోకేష్ యువగళం పాదయాత్రను విజయవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ సూచనతో దానిని సక్సెస్ చేస్తానని చెప్పారు.
మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతి.. సర్పంచ్ నుంచి రాజ్యసభ వరకు సాగిన రాజకీయ ప్రస్థానం..
అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా నుంచి అధికార వైసీపీ పతనం ప్రారంభమైందని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని, అలాగే ఆయన అనుచరులను టీడీపీలోకి ఆహ్వానించామని చెప్పారు. కాకాణి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత.. ఆ పార్టీ నుంచి ముగ్గురు శాసన సభ్యులు బయటకు వచ్చారని తెలిపారు. తాము మూడు శాసన మండలి స్థానాల్లో విజయం సాధించామని గుర్తు చేశారు.