ప్రత్యేక హోదా: బిజెపిపై ఒత్తిడి పెంచేలా బాబు ప్లాన్ ఇదే
బిజెపిపై బాబు ప్లాన్ ఇదే
అమరావతి: ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కేంద్రంపై మరింత ఒత్తిడిని తెచ్చేందుకు టిడిపి ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీలోని పలు ప్రధాన కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో ఏపీ రాష్ట్రంలో కూడ క్షేత్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది.
2014లో ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చాలనే డిమాండ్ తో ఆందోళనలను చేయాలని టిడిపి ప్లాన్ చేస్తోంది. రెండు రోజుల క్రితం జరిగిన టిడిపి సమన్వయ కమిటి సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నారు.
ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీలను అమలు చేయాలనే డిమాండ్తో ఢిల్లీ కేంద్రంగా ఎంపీలతో పాటు పార్టీ నేతలు ఆందోళనలు నిర్వహించనున్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ప్రత్యేక హోదా ఇతర అంశాలపై కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు గాను టిడిపి ధర్నాలు చేయాలని ప్లాన్ చేస్తోంది.
ఏపీకి ఇచ్చిన విభజన హమీలను అమలు చేయాలనే డిమాండ్ తో ఆయా శాఖల ప్రధాన కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయాలని టిడిపి ప్లాన్ చేస్తోంది. త్వరలోనే టిడిపి ఎంపీలు, నేతలు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయాల వద్ద ఆందోళనలకు దిగనున్నారు.
ఈ విషయమై పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు ఇప్పటికే దిశా నిర్ధేశం చేశారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల నాటికి ఏపీకి జరిగిన అన్యాయంపై ఢిల్లీ వేదికగా వేడిని పుట్టించాలని ఆ పార్టీ ఆలోచనగా కన్పిస్తోంది. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో కూడ ఆయా అంశాలపై ఆందోళనలను నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.
ఏక కాలంలో డిల్లీతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడ ఆందోళనలు నిర్వహించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఎప్పటి నుండి ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.