కౌంటింగ్ ఎఫెక్ట్: మహానాడుపై చంద్రబాబు తర్జనభర్జన
మహానాడు నిర్వహణపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తర్జన భర్జన పడుతున్నారు. ఎన్నికల ఫలితాలకు మహానాడు నిర్వహణ తేదీకి మధ్య నాలుగు రోజుల తేడానే ఉంది.
అమరావతి: మహానాడు నిర్వహణపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తర్జన భర్జన పడుతున్నారు. ఎన్నికల ఫలితాలకు మహానాడు నిర్వహణ తేదీకి మధ్య నాలుగు రోజుల తేడానే ఉంది. దీంతో మహానాడును వాయిదా వేయాలని కొందరు పార్టీ సీనియర్లు బాబుకు సూచించారు.మరో వైపు ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలు కోరారు.
ప్రతి ఏటా మే చివరి వారంలో మహానాడును నిర్వహిస్తారు. మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతిని కూడ మహానాడులోనే ఘనంగా నిర్వహిస్తారు. మే 27 నుండి రెండు రోజులు లేదా మూడు రోజుల పాటు మహానాడును నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
అయితే ఈ నెల 23 వతేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి.కౌంటింగ్ లోనే పార్టీ యంత్రాంగమంతా తలమునకలయ్యే అవకాశం ఉన్నందున.... వెంటనే మహానాడు నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు భావించారు.
మంగళవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబుతో టీడీపీ సీనియర్లు, మంత్రులు అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మహానాడు నిర్వహణ కంటే వాయిదా వేయడమే మంచిదని పార్టీ నేతలు సూచించారు.
మహానాడు వాయిదా వేస్తే ఎన్టీఆర్ జయంతిని మాత్రం ఘనంగా నిర్వహించాలని కూడ పార్టీ నేతలు బాబు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ విషయమై మాత్రం చంద్రబాబునాయుడు తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. మెజార్టీ నేతలు మాత్రం మహానాడు నిర్వహాణను వ్యతిరేకించినట్టుగా సమాచారం.
అయితే గతంలో కూడ మహానాడు నిర్వహించకుండా ఉన్న సందర్భాలను కూడ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. 1985, 1991, 1996 సంవత్సరాల్లో మహానాడును నిర్వహించలేదు. 1985, 1996 సమయాల్లో టీడీపీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 2012 లో కూడ టీడీపీ మహానాడును వాయిదా వేసింది.
2012 లో ఉప ఎన్నికల కారణంగా మహానాడును వాయిదా వేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కారణంగా ఆ మాసంలో నిర్వహించాల్సిన మహానాడును చంద్రబాబునాయుడు వాయిదా వేశారు. అయితే ఈ దఫా కూడ మహానాడును వాయిదా వేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా అదికారికంగా ఆ పార్టీ ప్రకటించాల్సి ఉంది.