Asianet News TeluguAsianet News Telugu

ఆ ఒక్కటీ చేసి ప్రాణాలు కాపాడండి: సీఎం జగన్ కు రామ్మోహన్ నాయుడు లేఖ

కరోనా వైర‌స్ సామాజిక‌వ్యాప్తి ద‌శ‌కు చేరుకోవ‌డంతో ప్ర‌జల ప్రాణాల కాపాడాలని కోరుతూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ‌మోహ‌న్‌నాయుడు లేఖ రాశారు. 

TDP MP Rammohan Naidu Writes a Letter to CM YS Jagan
Author
Srikakulam, First Published Jul 23, 2020, 6:22 PM IST

శ్రీకాకుళం: కరోనా వైర‌స్ సామాజిక‌వ్యాప్తి ద‌శ‌కు చేరుకోవ‌డంతో ప్ర‌జల ప్రాణాల కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్లాస్మా బ్యాంకులను ఏర్పాటు చేయాలని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ‌మోహ‌న్‌నాయుడు లేఖ రాశారు. గ‌త నాలుగు నెల‌లుగా దేశంతోపాటు మ‌న రాష్ట్రం కరోనా వైర‌స్ క‌ట్ట‌డిలో నిమ‌గ్న‌మైంద‌ని... దుర‌దృష్ట‌వ‌శాత్తు వైర‌స్ సామాజిక వ్యాప్తి ద‌శ‌కు చేరుకుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

వైర‌స్ వ్యాప్తి ఇటీవ‌ల ఆందోళ‌న‌క‌ర స్థాయికి చేరుకుందని... గత 4 రోజులలో 18,000 వేల‌కు పైగానే కేసులు నమోదయ్యాయ‌ని  అన్నారు. ఇది 15 శాతం కావ‌డంతో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయని లేఖ‌లో వివ‌రించారు. ఆస్ప‌త్రుల్లో స‌రైన వ‌స‌తుల్లేక‌పోవ‌డం, క్వారంటైన్ కేంద్రాల నిర్వ‌హ‌ణా స‌క్ర‌మంగా లేక‌ కరోనా రోగులకు మెరుగైన‌ చికిత్స అంద‌డంలేదన్నారు. దీంతో మ‌ర‌ణాలు తీవ్రం అవుతున్నాయ‌ని... ఈ నేప‌థ్యంలో ప్ర‌తీ జిల్లాలో ప్లాస్మా బ్యాంకు ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని లేఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 

TDP MP Rammohan Naidu Writes a Letter to CM YS Jagan

కోవిడ్19 ప్ర‌భావం తీవ్రంగా వున్న రోగుల‌కు ప్లాస్మా చికిత్స ద్వారా మంచి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని వైద్యులు అంద‌జేసిన నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయ‌ని వివ‌రించారు. ప్ర‌జ‌లు, వైద్య‌నిపుణులు, సామాజిక‌ కార్య‌క‌ర్త‌ల నుంచి ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటు చేయాల‌నే విన‌తులు త‌న‌కొచ్చాయ‌ని సీఎంకి రాసిన లేఖ‌లో ఎంపీ వివ‌రించారు. 

రాష్ట్రంలో  ప్లాస్మా, ప్లేట్‌లెట్లను అదనంగా సేకరించే బ్లడ్ బ్యాంకులున్నా అవి ప్రైవేటు నియంత్ర‌ణ‌లో వుండ‌టం వ‌ల్ల సేవ‌లు అంతంత‌మాత్రంగానే అందుతున్నాయ‌ని పేర్కొన్నారు. ప్రైవేటు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలో వున్న ఈ బ్యాంకుల‌ను సెంట్రిక్ ప్లాస్మా బ్యాంకులుగా ఏర్పాటు చేసి ప్ర‌భుత్వ నియంత్ర‌ణ‌లో ప‌నిచేసేలా చూడాల‌ని కోరారు. 

read more  రఘురామ కృష్ణమ రాజు సీటుపై కన్నేసిన కమెడియన్ పృథ్వీ

ఇప్ప‌టికే కరోనా వైర‌స్ బారి నుంచి కోలుకున్న 22 వేల మంది నుంచి ప్లాస్మా సేక‌రించి జిల్లా ప్లాస్మా సెంట్రిక్ బ్యాంకుల‌లో నిల్వ చేయ‌డం ద్వారా మ‌రింత మంది రోగుల‌ను కాపాడే అవ‌కాశం వుంద‌ని సీఎంకి రాసిన లేఖ‌లో ఎంపీ వివ‌రించారు. 

శ్వాస స‌మ‌స్య‌ల‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజ‌న్ త‌క్ష‌ణ అవ‌స‌రం అని, అందువ‌ల్ల ప్రైవేటు వ్యాపారులు బ్లాక్ చేసే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం దీనిపై దృష్టి సారించాల‌ని సూచించారు. ఆగ‌స్టు నెల‌కి కోవిడ్-19 వ్యాప్తి ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరే ప్ర‌మాదం వుంద‌నే నివేదిక‌లు వ‌స్తున్న దృష్ట్యా త‌క్ష‌ణ‌మే ప్ర‌తి జిల్లాలో ప్లాస్మా బ్యాంకు ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని... ఆక్సిజ‌న్‌, మందులు వంటివి బ్లాక్ మార్కెట్‌కి త‌ర‌లిపోకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎంపీ రామ‌మోహ‌న్‌నాయుడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి రాసిన లేఖ‌లో కోరారు.


  

Follow Us:
Download App:
  • android
  • ios