వైసీపీ ఎంపీల రాజీనామా డ్రామాలు: టిడిపి
వైసీపీపై టిడిపి ఎంపీల విమర్శలు
విజయవాడ; ఉప ఎన్నికలు రావనే ఉద్దేశ్యంతోనే వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని టిడిపీ విమర్శించింది. రాజీనామాలపై చిత్త శుద్ది ఉంటే 2016లోనే వైసీపీ ఎంపీలు ఎందుకు తమ పదవులకు రాజీనామాలు చేయలేదని టిడిపి ఎంపీలు ప్రశ్నించారు.
మంగళవారం నాడు విజయవాడలో టిడిపి ఎంపీలు కేశినేని కొనకళ్ళ నారాయణలు మీడియాతో మాట్లాడారు. వైసీపీ, బిజెపిలపై విమర్శలు గుప్పించారు.ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తామని చెప్పిన వైసీపీ నేతలు ఎందుకు ఇంతవరకు తమ రాజీనామాలను ఆమోదించుకోలేకపోయారని వారు ప్రశ్నించారు.కేసుల నుండి బయటపడేందుకే వైసీపీ ఎంపీలు రాజీనామాల డ్రామాలు ఆడుతున్నారని టిడిపి ఎంపీలు ఆరోపించారు. కేసుల నుండి బయటపడేందుకుగాను బిజెపితో వైసీపీ కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు.
చిత్తశుద్ది ఉంటే 2016లోనే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఉండేవారని టిడిపి ఎంపీలు విమర్శించారు.ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ రాజీనామా డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఏడాది సమయం ఉన్నందున ఎన్నికలు రావనే ఉద్దేశ్యంతోనే వైసీపీ ఎంపీలు ఇప్పుడు రాజీనామాల అంశాన్ని తెరమీదికి తెచ్చారని వారు చెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్దితో తాము పోరాటం చేస్తున్నామని టిడిపి ఎంపీలు చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బిజెపి, వైసీపీలు ప్రయత్నాలు చేస్తున్నాయని వారు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎన్డీఏ నుండి కూడ తమ పార్టీ బయటకు వచ్చిన విషయాన్ని ఎంపీలు గుర్తు చేశారు.