ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర చేసినా, రథయాత్ర చేసినా ప్రజలు నమ్మరని బుద్దా ఎద్దేవా చేశారు. 

అమరావతి: కేంద్రంతో చేతులు కలిపి విశాఖ ఉక్కును అమ్మేందుకు ప్రణాళిక రూపొందించిన ఏ2 విజయసాయి రెడ్డి... ఇప్పుడు ఉక్కు కార్మికులకు మద్దతుగా పాదయాత్ర చేస్తాననడం హాస్యాస్పదంగా వుందని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. వీధి నాటకాలకు అలవాటు పడ్డ విజయసాయి పాదయాత్ర పేరుతో మరో నాటకానికి తెరలేపారన్నారు. ఆయన పాదయాత్ర చేసినా, రథయాత్ర చేసినా ప్రజలు నమ్మరని బుద్దా ఎద్దేవా చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

''విజయసాయిరెడ్డికి విశాఖ ఉక్కును పరిరక్షించాలన్న చిత్త శుద్ధి ఉంటే ముందు తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. ఆ దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా? విజయసాయిరెడ్డి విశాఖలో 25 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఎవరికి ఉపయోగం? వాకింగ్ చేయడం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎలాంటి ఉపయోగం లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేసిన డీల్ ను వెనక్కు తీసుకోవాలి. చేసిన పనికి లెంప లేసుకోవాలి'' అని కోరారు. 

read more అసెంబ్లీలో తీర్మానం చేయాలి: జగన్ తో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతల భేటీ

''వైసీపీ ఎంపీలు ఆంధ్రా భవన్ నుంచి పార్లమెంటు వరకూ పాదయాత్ర చేయాలి. ఢిల్లీలో పాదయాత్ర చేస్తే ప్రధాని మోదీకి తెలుస్తుంది కానీ విశాఖలో చేస్తే ఉపయోగం లేదు. వైసీపీ ఆరుగురు రాజ్యసభ సభ్యులు తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి ఇవ్వాలి. అలాగే 21 మంది వైసీపీ పార్లమెంటు సభ్యులు తమ రాజీనామా పత్రాలను లోక్ సభ స్పీకర్ కు ఇవ్వాలి'' అని సూచించారు. 

''నేను విశాఖలో వాకింగ్ చేస్తాను, ట్రాఫిక్ ఆపేస్తాను అంటే ఏం ఉపయోగం విజయసాయి? ఇకనైనా వీధి నాటకాలు కట్టిపెట్టండి. దోచుకోవడానికే విశాఖపై కన్నేశారని అక్కడి ప్రజలకు అర్ధమైంది. దమ్ముంటే వైసీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లాలి. ఇన్నాళ్లూ కేసులకు భయపడి మాట్లాడలేదు...విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం చేస్తున్నందున ధర్నా చేస్తున్నామని ప్రధానికి చెప్పండి.. పాదయాత్ర చేస్తానని ఒక రోజు, ఢిల్లీ వెళ్లి పోరాడతానని ఒక రోజు చెప్పి డ్రామాలాడుతున్నారు. ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టి విశాఖ ఉక్కు కోసం చిత్తశుద్దితో పోరాడండి'' అని బుద్దా సూచించారు.