వరి సాగు సోమరిపోతు వ్యవసాయం... మంత్రి వ్యాఖ్యలపై అనగాని ఫైర్
వరి సాగుచేయడం సోమరిపోతు వ్యవసాయం అని స్వయంగా ఓ మంత్రే మాట్లాడటం సిగ్గుచేటని టిడిపిఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు.
అమరావతి: వరిసాగు పట్ల మంత్రి శ్రీరంగనాథరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వరి సాగుచేయడం సోమరిపోతు వ్యవసాయం అని మంత్రి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతులు కష్టపడకుండా పండించవచ్చని చెప్పడం అన్నదాత కష్టాన్ని అవమానించడమేనని అన్నారు. కష్టపడకుండా పంట ఎలా పండించాలో శ్రీరంగనాథరాజు చెప్తే రైతులు నేర్చుకుంటారని అనగాని ఎద్దేవా చేశారు.
''అన్నదాతలను అవమానించేలా మాట్లాడిన రంగనాథరాజు రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలి. తన మంత్రిమండలి సభ్యుడి వ్యాఖ్యలను సీఎం సమర్థిస్తున్నారా?'' అని ఎమ్మెల్యే నిలదీశారు.
''వైసీపీ రెండేళ్ల పాలనలో 760 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఎన్నికల ముందు రైతులను ఉద్దరిస్తానంటూ ప్రగల్బాలు పలికి ఇప్పుడు వారిని ఉరికంబం ఎక్కిస్తున్నారు. మోటార్లకు మీటర్లు బిగిస్తే తీవ్రమైన ఉద్యమం జగన్ ఎదుర్కొంటారు'' అని అనగాని హెచ్చరించారు.