తెదేపా మహానాడు సమావేశంలో రెండు లక్షల మందికిపైగా సభ్యుల కోసం ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వంటకాలతో ఆహార విందు ఏర్పాట్లు చేశారు.
ఆహా ఏమి రుచి..తినరా మైమరిచి..మహానాడులో అతిథులకు నోరూరించే వంటకాలు!
తెదేపా మహానాడు సమావేశానికి రంగం సిద్ధమవుతోంది. ఈ భారీ రాజకీయ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశముండటంతో, పార్టీ వారికి ప్రత్యేక ఆతిథ్యాన్ని అందించేందుకు పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సారి మహానాడులో ఆహార ఏర్పాట్లు అత్యంత ప్రత్యేకంగా ఉండనున్నాయి. రెండు రోజుల పాటు ప్రతి రోజు రెండు లక్షల మందికిపైగా అల్పాహారం, భోజనం, సాయంత్రం స్నాక్స్ వడ్డించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాక, చివరి రోజు గురువారం జరిగే బహిరంగ సభకు ఐదు లక్షల మందికి ఆహారం అందించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ సందర్భంగా సభ ప్రాంగణంలో, పరిసర ప్రాంతాల్లోనూ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు.
రుచుల పండుగగా..
వంటకాల విషయంలో ఈసారి ప్రత్యేకంగా 20 రకాల కూరలు, వంటకాలు ప్రతిరోజూ వడ్డించనున్నారు. ఈ పనుల్లో 1700 మంది వంటవారు, 800 మంది వడ్డింపునకు బృందాలు పనిచేస్తున్నాయి. మాంసాహారం,శాఖాహార వంటకాల్లో ప్రాంతీయ రుచులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఉదయం అల్పాహారంగా టూటీ ఫ్రూటీ కేసరి, పొంగలి, ఇడ్లీ, టమాటా బాత్ వంటి వంటకాలు అందిస్తారు. మధ్యాహ్నం మాంసాహార ప్రియుల కోసం గోంగూర చికెన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ, ఎగ్ రోస్ట్ లాంటివి వుంటాయి. శాఖాహారం కోరేవారికి టమాటా పప్పు, గోంగూర పూల్ మఖానా, బెండకాయ బూందీ వంటివి వడ్డిస్తారు. సాయంత్రం స్నాక్స్లో కార్న్ సమోసా, మిర్చి బజ్జీలు, పకోడీలు వంటివి అందిస్తారు. రాత్రి విందులో వంకాయ బఠాణీ, ఆలూ ఫ్రై, పెసరపప్పు చారు వంటివి ఉంటాయి.
పెద్ద మొత్తంలో తాపేశ్వరం కాజా, ఒంగోలు మైసూర్ పాక్, ఫ్రూట్ హల్వా లాంటి మిఠాయిలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ వేడుక కోసం 50 వేల గుడ్లు కూడా సిద్ధం చేశారు. వంటలు తయారవుతున్న మహానాడు వంటశాలను మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు మరియు నేతలు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా ఆవకాయ పచ్చడి తయారీలో పాల్గొనడం విశేషం.
తెదేపా మహానాడు ఈసారి కేవలం రాజకీయ చర్చలకే కాకుండా, ఆహారంలోనూ సరికొత్త రుచి చూపించబోతోంది. పార్టీలో పాల్గొనేవారికి ఇది ఓ రుచుల పండుగగా మారనుంది.