ఏపీ పరిషత్ ఎన్నికలు: తెలుగుదేశం సంచలన నిర్ణయం.. బరిలో లేనట్టేనా..?
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ముగిసిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో చతికిలపడిన తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకునే యోచనలో వుంది.
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ముగిసిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో చతికిలపడిన తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకునే యోచనలో వుంది.
అందువల్లే ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిందని టీడీపీ తొలి నుంచి ఆరోపిస్తోంది..దీనిపై ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేసింది.
ఎస్ఈసీ మార్గదర్శకాలను తుంగలో తొక్కి వైసీసీ బెదిరింపులతో ఏకగ్రీవాలు చేసుకుందని.. పోటీలో నిలిచిన ప్రత్యర్థులను విత్ డ్రా చేసుకునేలా అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపించింది.
ఈ నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలనే బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన నీలం సాహ్ని ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు.
దీంతో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు లేవని.. అందుకే ఎన్నికలను బహిష్కరించినట్లు టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పరిషత్ ఎన్నికలపై కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
ఎస్ఈసీగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు, సాధ్యాసాధ్యాలపై కసరత్తు ప్రారంభించారు. దీనిలో భాగంగానే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 8న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 9న అవసరమైన చోట రీ పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. ఈ నెల 10న పరిషత్ ఎన్నికల ఫలితాలను వెల్లడించనుంది.