టీడీపీకి షాక్: రోడ్డు ప్రమాదాల్లో నేతలను కోల్పోతున్న టీడీపీ
రోడ్డు ప్రమాదాలు టీడీపీకి శాపంగా మారుతున్నాయి. కీలకమైన టీడీపీ నేతలు రోడ్డు ప్రమాదాల్లోనే మరణించారు.
హైదరాబాద్:రోడ్డు ప్రమాదాలు టీడీపీకి శాపంగా మారుతున్నాయి. కీలకమైన టీడీపీ నేతలు రోడ్డు ప్రమాదాల్లోనే మరణించారు. తాజాగా అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మరణించాడు.
2012, నవంబర్ 2న రోడ్డు ప్రమాదంలో ఎర్రంనాయుడు కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద రహదారికి అడ్డంగా తిరుగుతున్న లారీని ఎర్రన్నాయుడి వాహనం ఢీకొట్టింది.
దీంతో ఎర్రన్నాయుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆనాడు చంద్రబాబునాయుడు పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్రలో చంద్రబాబునాయుడుకు సెక్యూరిటీ సిబ్బంది మరునాడు ఈ విషయాన్ని చేరవేశారు. అయితే ఈ విషయం విన్న చంద్రబాబునాయుడు ఈ విషయమై క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించాడు.
ఆ రోజు విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది మరోసారి స్థానిక టీడీపీ నేతలతో చర్చించి ఎర్రన్నాయుడు చనిపోయారని బాబుకు సమాచారాన్ని చేరవేశారు. దీంతో పాదయాత్రను నిలిపివేసి... అక్కడి నుండి నేరుగా శ్రీకాకుళం చేరుకొన్నారు. అయితే ఆ సమయంలో విదేశాల్లో చదువుకొంటున్న ప్రస్తత శ్రీకాకుళం ఎంపీ ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు స్వదేశానికి పయనమయ్యాడు.
విశాఖ ఎయిర్పోర్ట్ లో బాబు దిగగానే... అదే సమయానికి రామ్మోహన్ నాయుడు కూడ అక్కడికి చేరుకొన్నాడు. రామ్మోహన్ నాయుడు కోసం కొద్దిసేపు చంద్రబాబునాయడు వేచి చూసి తనతో పాటు శ్రీకాకుళం తీసుకెళ్లాడు.
ఈ ఘటన జరిగిన తర్వాత 2013 ఆగస్టు 15న హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లాల్జాన్ తనువు చాలించారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు సాగుతున్న సమయంలో విజయవాడలో ప్రస్తుత మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దీక్షను లాల్జాన్ భాషా ప్రారంభించాల్సి ఉంది. ఈ దీక్షను ప్రారంభించేందుకు హైద్రాబాద్ నుండి విజయవాడకు వెళ్తూ నార్కట్ పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 29వ తేదీన నార్కట్పల్లి మండలంలోని అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత హరికృష్ణ మృతి చెందారు. ఇదే జిల్లాలోని మునగాల మండంలో ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తనయుడు జానకీరామ్ మృత్యువాతపడ్డారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి తాజాగా మృత్యువాతపడ్డారు. రోడ్డు ప్రమాదాల్లో టీడీపీకి తీవ్రంగా నష్టం కల్గిస్తున్నాయి. కీలకమైన నేతలు ఈ ప్రమాదాల్లో మరణిస్తున్నారు.
సంబంధిత వార్తలు
రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం
నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ మృతి ( వీడియో)
ఆస్పత్రికి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్: ఇంటికి చేరుకుంటున్న బంధువులు
ప్రజల్లో చెరగని ముద్ర... హరికృష్ణ రాజకీయ ప్రస్థానం
హరికృష్ణ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి