బైక్ నుంచి లారీ వరకు, రవాణా వాహనాల పన్ను పెంపు.. జగన్ ది బాదుడే బాదుడు : యనమల చురకలు
రాష్ట్రంలో రవాణా వాహనాల పన్నును ఏపీ ప్రభుత్వం పెంచడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. బైకు నుంచి లారీల వరకు వాహనాల కొనుగోలుపై లైఫ్ టైమ్ ట్యాక్స్ను 6 శాతం పెంచారని రామకృష్ణుడు ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో రవాణా వాహనాల పన్నును ఏపీ ప్రభుత్వం పెంచడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనపై ప్రజలకు అసహ్యం కలుగుతోందని.. రవాణా వాహనాల పన్నును పెంచడం వల్ల ప్రజలకు ప్రతి ఏటా రూ.250 కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. టీడీపీ హయాంలో ప్రతి 6 నెలలకు రవాణా శాఖకు రూ.1500 కోట్ల ఆదాయం వచ్చేదని.. ప్రస్తుత వైసీపీ పాలనలో అది రూ.2,131 కోట్లకు పెరిగిందని యనమల దుయ్యబట్టారు.
బైకు నుంచి లారీల వరకు వాహనాల కొనుగోలుపై లైఫ్ టైమ్ ట్యాక్స్ను 6 శాతం పెంచారని రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రెండు సార్లు మద్యం ధరలు, మూడుసార్లు ఆర్టీసీ బస్ టికెట్ల ధరలు, ఏడు సార్లు విద్యుత్ ఛార్జ్లను పంచారని యనమల చురకలంటించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ఛార్జీలు ఎక్కువని.. అన్ని రకాల ఛార్జీలను పెంచుతూ జగన్ ప్రభుత్వంపై భారాన్ని మోపుతోందని రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALso REad: అప్పుల ఊబిలోకి ఆంధ్రప్రదేశ్, కాగ్ సమక్షంలో లెక్కలు తేల్చుకుందాం.. జగన్కు యనమల సవాల్
అంతకుముందు రాష్ట్రంలో పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బుధవారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై నమోదు చేస్తున్న అక్రమ కేసులపై చంద్రబాబు ప్రస్తావించారు. పుంగనూరులో టీడీపీ నేతలపై కేసులకు సంబంధించి పోలీసులు,రెవెన్యూ అధికారులు ఫిర్యాదుదారులుగా వుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే సెక్షన్ 307 లేదా ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు పెడుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మాచర్ల, కుప్పం, తంబళ్లపల్లె ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లలోనూ ఇదే కనిపిస్తోందన్నారు.
కొందరు పోలీస్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తెలుగుదేశం మద్ధతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒక వర్గం పోలీసులు, వైసీపీ నేతలు కుమ్మక్కయ్యారని చంద్రబాబు దుయ్యబట్టారు. కొన్నిసార్లు పోలీసులు యూనిఫాం లేకుండానే వచ్చి నిందితులను తీసుకెళ్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.