రఘురామను దొడ్డి దారిన జైలుకు తరలించారు: యనమల రామకృష్ణుడు ఫైర్
సిఐడి చేతిలో అరెస్టయిన వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజును జైలుకు తరలించడాన్ని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తప్పు పట్టారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఖండించారు.
అమరావతి: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృ్ణమరాజు ఆరోగ్యంపై కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి దొడ్డిదారిన జైలుకు తరలించడం దురుద్దేశపూరితమని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రఘురామ కృష్ణమ రాజును పోలీసులు హింసించడాన్ని ఆయన ఖండించారు.
రఘురామకృష్ణమ రాజుకు ప్రాణ హాని ఉందని ఆయన భార్య ఆందోళన వ్యక్తం చేశారని యనమల అన్నారు. జైలులో ఏదైనా అపకారం జరిగితే సీఎం, అడిషనల్ డీజీ, జైలు సూపరింటిండెంట్లు బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన అన్నారు. చట్ట వ్యతిరేక, అరాచక, హింసాత్మక చర్యలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు నిరసించాలని ఆయన కోరారు. ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యులకు ఈ జగన్ రెడ్డి పాలనలో ఏం రక్షణ ఉంటుందని ఆయన ప్రశ్నించారు.
సీఐడి కోర్టు ఆదేసాలను బేఖాతరు చేస్త రఘురామను జైలుకు తరలించారని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రఘురామకు ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్, సిఐడి అధికారులదే బాధ్యత అని ఆయన అన్నారు. తాడేపల్ిల ప్యాలెస్ డైరెక్షన్ లో మెడికల్ బోర్డు నివేదికలు మారుతున్నాయని ఆయన విమర్శించారు.
ఈ రోజు మధ్యాహ్నానికి వైద్య పరీక్షల నివేదిక అందించాలని హైకోర్టు చెప్పిందని, అయినా పట్టించుకోకుండా జాప్యం చేశారని ఆయన అన్నారు. తన భర్తకు ప్రాణహాని ఉందని రఘురామ భార్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. రఘురామపై పోలీసుల పాశవిక చర్యపై మానవ హక్కుల సంఘాలు స్పందించాలని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలకు లోబడి రఘురామకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు.