ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ వ్యవహారంపై టీడీపీ నేత పంచుమర్తి అనూరాధ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్య నియంత్రణ, నిషేధంపై గొప్పలు చెప్పే జగన్మోహన్ రెడ్డి ఈ అరెస్ట్‌పై ప్రజలకు సమాధానం చెప్పాలని అనూరాధ డిమాండ్ చేశారు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకం రేపుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ నేత పంచుమర్తి అనూరాధ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. శరత్ చంద్రారెడ్డి ఎవరో కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి అన్న అని తెలిపారు. మరి ఈడీ అరెస్ట్ ఘటనపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని.. మద్య నియంత్రణ, నిషేధంపై గొప్పలు చెప్పే జగన్మోహన్ రెడ్డి ఈ అరెస్ట్‌పై ప్రజలకు సమాధానం చెప్పాలని అనూరాధ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇసుక, మైన్, వైన్, బియ్యం, అంబులెన్స్ మాఫియాలు నడిపిన జగన్... ఇప్పుడు వైద్యం, ప్రజారోగ్యం గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also Read:ఢిల్లీ లిక్కర్ స్కాం‌లో ఈడీ దూకుడు: ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ రెడ్డి ‌, వినయ్ అరెస్ట్

కోవిడ్ సమయంలో రోగులకు భోజనం సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు జగన్ ప్రభుత్వం ఇంత వరకు బిల్లులు చెల్లించలని అనూరాధ ఆరోపించారు. కోవిడ్ మరణాలపై తప్పుడు లెక్కలు చెప్పి, కోట్లాది రూపాయలను జగన్ స్వాహా చేశారని ఆమె వ్యాఖ్యానించారు. కుయ్ కుయ్ మంటూ అంబులెన్స్‌లు వస్తాయన్న జగన్... మరి ఇప్పుడు అంబులెన్స్‌లు లేక బిడ్డల శవాలను భుజాలపై వేసుకెళ్తున్న ఘటనలు జగన్‌కి కనిపించడం లేదా అని అనూరాధ ప్రశ్నించారు. జగన్ తీరు కారణంగా ప్రస్తుతం రోగులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీసం పారా సిటమాల్ టాబ్లెట్ కూడా దొరకడం లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం జగన్ అరాచక పాలనకు నిదర్శనమని ...మహనీయుల గొప్పతనం ఆయనకు తెలియదన్నారు.