రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకే జైల్లోకి చంద్రబాబు.. ఏపీలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం : నారా బ్రాహ్మణి
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో వుందన్నారు టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసినందుకే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లుగా వుందన్నారు. ఒక సీఎంగా ప్రజలకు ఉపయోగపడే పని చేయడం తప్పు అనే స్థాయికి రాజకీయాలు దిగజారాయని నారా బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో వుందన్నారు టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో ఆమె ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసినందుకే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లుగా వుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ ఇలా ప్రతి ప్రాజెక్ట్ను ఆయన ప్రజల కోసమే తలపెట్టారని బ్రాహ్మణి పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్ట్ల విషయంలో గట్టిగా నిలదీసినందుకు అంగళ్లు కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. వీటన్నింటినీ వైసీపీ నేరాలు అంటోందని.. ఒక సీఎంగా ప్రజలకు ఉపయోగపడే పని చేయడం తప్పు అనే స్థాయికి రాజకీయాలు దిగజారాయని నారా బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపోతే.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను గురువారం హైకోర్టు డిస్పోజ్ చేసింది. లోకేష్ దాఖలు చేసిన బెయిట్ పిటిషన్పై గత విచారణ సందర్భంగా.. ఆయనను ఈ నెల 12 వరకు అరెస్ట్ చేయవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు మరోమారు విచారణ జరగగా.. ఈ కేసులో సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో ఆయన కుటుంబ సభ్యులు లబ్ది పొందినట్టుగా ఆరోపణలు చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే పిటిషనర్(లోకేష్)ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. అందుకే ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్టుగా చెప్పారు.
మరోవైపు సీఐడీ తరఫున లాయర్లు వాదనలు వినిపిస్తూ.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ను నిందితుడిగా చేర్చలేదని, అందువల్ల ఆయనను అరెస్ట్ చేయబోమని తెలిపారు. ఈ కేసులో లోకేష్ పేరు చేర్చితే.. 41 ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించనున్నట్టుగా చెప్పారు. అయితే ఇరుపక్షాల వాదనల విన్న హైకోర్టు.. లోకేస్ ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్పోజ్ చేసింది.