నాలుగు అద్దాలు పగొలగొడితే భయపడతామా... బూతులకు కేరాఫ్ అడ్రస్ వైసీపీయే: నారా లోకేశ్ వ్యాఖ్యలు
నాలుగు అద్దాలు పగులగొడితే టీడీపీ భయపడదని లోకేశ్ తేల్చిచెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగే పది నిమిషాల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు. దాడి జరిగిన తర్వాత వారి వాహనాలు డీజీపీ ఆఫీసు మీదుగానే వెళ్లాయని.. ఎప్పుడూ లేని విధంగా ఏపీలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని లోకేశ్ ఆరోపించారు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jaganmohan reddy ) సీఎం అయ్యాక డ్రగ్స్ (drugs) లీగలైజ్ అయ్యిందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (nara lokesh) . తెలుగుదేశం పార్టీ (telugu desam party) కార్యాలయాలపై వైసీపీ (ysrcp) శ్రేణుల దాడుల నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన... మొన్న విశాఖ మన్యంలో తెలంగాణ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ (ap police) పనిచేయడం లేదని చెప్పడానికే ఇదే ఉదాహరణ అని ఆయన అన్నారు. ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్.. గంజాయిపై ఉద్యమానికి శ్రీకారం చుట్టారని లోకేశ్ గుర్తుచేశారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్కు చీమకుట్టినట్లయినా లేదని ఆయన దుయ్యబట్టారు.
నాలుగు అద్దాలు పగులగొడితే టీడీపీ భయపడదని లోకేశ్ తేల్చిచెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగే పది నిమిషాల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు. దాడి జరిగిన తర్వాత వారి వాహనాలు డీజీపీ ఆఫీసు మీదుగానే వెళ్లాయని.. ఎప్పుడూ లేని విధంగా ఏపీలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని లోకేశ్ ఆరోపించారు. తెలంగాణ పోలీసులకు (telangana police) ఉన్న చిత్తశుద్ధి ఏపీ పోలీసులకు లేదని ఆయన మండిపడ్డారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా ఏపీలోనే వాటి మూలాలు బయటపడుతున్నాయని లోకేశ్ ధ్వజమెత్తారు. ఏపీ నుంచి గంజాయి వస్తుందని హైదరాబాద్ సీపీ చెప్పారని ఆయన ఆరోపించారు.
ALso Read:హద్దు మీరితే.. ఇకపైనా రియాక్షన్ ఇలాగే వుంటుంది: టీడీపీ నేతలకు సజ్జల వార్నింగ్
జగన్ ఓ సైకో శాడిస్ట్ అని అనుకున్నామని.. నిన్నటితో అది నిర్ధారణ అయ్యిందని లోకేశ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేసిన తప్పుని నిలదీయాలని.. అవసరమైతే పోరాడాలని ప్రజలు ప్రతిపక్షంగా తమకు అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చని.. లేదంటే మూసుకుని కూర్చొవచ్చని లోకేశ్ తెలిపారు. పోరాడాలని వుంటే ప్లేస్ చెబితే తామే వస్తామని ఆయన సవాల్ విసిరారు. మఫ్టీలో పోలీసులను పంపి దాడి చేయించే ప్రయత్నం చేశారని.. అందుకే ఆ పోలీసులను నిలదీశామని లోకేశ్ తెలిపారు.
స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఇదేనా అని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయానికి వైసీపీ వాళ్లు రావొచ్చు.. టీడీపీ కార్యకర్తలు రాకూడదా అని లోకేశ్ ప్రశ్నించారు. బూతులకు కేరాఫ్ అడ్రస్ వైసీపీనే అన్న ఆయన.. సైకో రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినప్పుడు వారిపై తేలికైన సెక్షన్లు పెట్టి వదిలేశారని లోకేశ్ దుయ్యబట్టారు. దాడి జరిగి 24 గంటలు అవుతోందని.. ఇప్పటి వరకు ఒక్కరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ వెనుక ఎవరెవరున్నారో ఇంత వరకు చెప్పలేదని లోకేశ్ మండిపడ్డారు. గతంలో గంజాయి సాగు చేయాలంటే ఏపీలో భయపడేవారని ఆయన గుర్తుచేశారు.