సబ్బంహరి ఇంటి కూల్చివేత : జగన్ కు ఆ జబ్బుంది.. అందుకే ఇలా.. : లోకేష్
ఏపీ సీఎం జగన్ రెడ్డి యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్నారని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి లోకేష్ ఎద్దేవా చేశాడు. ఈ వ్యాధి ప్రధాన లక్షణం విధ్వంసం అని విరుచుకుపడ్డారు.
ఏపీ సీఎం జగన్ రెడ్డి యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్నారని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి లోకేష్ ఎద్దేవా చేశాడు. ఈ వ్యాధి ప్రధాన లక్షణం విధ్వంసం అని విరుచుకుపడ్డారు. టీడీపీ నేత సబ్బంహరి ఇంటి ప్రహరీని కూల్చిన ఘటన మీద మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతున్నారన్న అక్కసుతో.. నోటీసు కూడా ఇవ్వకుండా ఈ కుట్ర చేశారని ఆరోపించారు.
ఉన్నత విలువలతో రాజకీయాల్లో ఉన్న సబ్బంహరిపై కక్షసాధింపు చర్యలు జగన్రెడ్డిని మరింత దిగజార్చాయని అన్నారు. ప్రశ్నిస్తే చంపేస్తాం, విమర్శిస్తే కూల్చేస్తాం అంటూ.. జగన్రెడ్డి తనలో ఉన్న సైకో మనస్తత్వాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విధ్వంసంతో ప్రజాగ్రహాన్ని అణిచివేయడం నియంతలకు సాధ్యం కాదని లోకేష్ పేర్కొన్నారు.
విశాఖపట్నంలోని టీడీపీ నేత సబ్బం హరి ఇంటి ప్రహరీగోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇంటికి ఆనుకుని ఉన్న టాయిలెట్ గదిని వారు కూల్చివేశారు. శనివారం తెల్లవారు జామున 4.30 గంటలకు వచ్చి కూల్చివేతలు చేపట్టారు. వాటిని అధికారులు అక్రమ కట్టడాలుగా చెబుతున్నారు. పార్కు స్థలాన్ని అక్రమించి సబ్బం హరి నిర్మాణాలు చేపట్టారని అధికారులు చెబుతున్నారు.
అయితే ముందుగా సమాచారం ఇవ్వకుండా జేసీబీలతో ఎలా కూల్చివేస్తారని అధికారులను సబ్బం హరి ప్రశ్నించారు. కూల్చివేతలపై అధికారులు సబ్బం హరికి సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. కూల్చివేత ఘటనతో సబ్బం హరి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతకు పాల్పడడాన్ని సబ్బం హరి తప్పు పడుతున్నారు. నోటీసులు ఇచ్చి ఉంటే తానే స్థలాన్ని అప్పగించి ఉండేవాడినని అంటున్నారు.