సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని అతి కిరాతకంగా చంపింది ఎవరో తెలిసినా సీఎం జగన్ ఇంకా దోబూచులాడటం ఎందుకని మాజీ మంత్రి జవహర్ నిలదీసారు. దీన్ని బట్టే ఈ రక్తచరిత్ర జగన్ డైరెక్షన్ లోనే జరిగిందని అర్థమవుతుందని ఆరోపించారు.
అమరావతి: మాజీ మంత్రి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య (ys viveka murder) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వైఎస్ కుటుంబానికి చెందినవారే ఈ హత్యకు పాల్పడగా... ఆ సమయంలో వారి వెనకున్నది... ఇప్పుడు వారిని కాపాడుతున్నది సీఎం జగనే (ys jagan) అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో సిబిఐకి వివేకా కూతురు సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలంలోని విషయాలు రాజకీయ ప్రకంపనలను మరింత పెంచాయి. దీంతో సీఎం జగన్, వైఎస్ కుటుంబసభ్యులపై ప్రతిపక్షాల విమర్శలు మరింత పెరిగాయి.
సొంత బాబాయ్ ని అతి కిరాతకంగా హతమార్చిన దోషులెవరో తెలిసాక కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు దోబుచులాట ఆడుతున్నారో చెప్పాలని మాజీ మత్రి కేఎస్ జవహర్ (KS Jawahar) ప్రశ్నించారు. ఈ రక్త చరిత్రకు దర్శకుడు జగనే... ఆయన్ను విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. అధికారం కోసమే జగన్ ఈ రక్త చరిత్రను వాడుకున్నారని మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసారు.
హత్యా రాజకీయాలు జగన్ కు కొత్తేమీ కాదని జవహర్ అన్నారు. మొద్దు శ్రీను (moddu srinu murder)హత్య కూడా జగన్ కనుసన్నల్లోనే జరిగినట్లు మాజీ మంత్రి సంచలన ఆరోపణలు చేసారు. చరిత్రలో తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన వారు వున్నారని... వారి జాబితాలో జగన్ ఒకరని జవహర్ వ్యాఖ్యానించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎవరిని బలి చేయబోతున్నారో చెప్పాలని జవహర్ నిలదీసారు. గత అనుభవాలను దృష్టిలో వుంచుకుని జగన్ కు తల్లి విజయమ్మ (ys vijayamma), చెల్లి షర్మిల (ys sharmila) దూరంగా వుంటే వారికే మేలని మాజీ మంత్రి అన్నారు.
ఇక వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో అలసత్వం వహించిన మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ (gautam sawang) పైనా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరం ఎవరు చేశారో తెలిసికూడా చట్టాన్ని జగన్ చుట్టం చేసిన సవాంగ్ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చాలని మాజీ మంత్రి జవహర్ పేర్కొన్నారు.
ఇక వివేకా మర్డర్ కేసుపై తాజాగా స్పందించిన టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ముఖ్యమంత్రి జగన్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సూత్రధారి ఎవరో తెలిసిపోయిందని... ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందన్నారు. వివేకా హత్య కేసులో జగన్ పూర్తిగా కూరుకుపోయారని చంద్రబాబు పేర్కొన్నారు.
సొంత బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తే... ఏమవుతుంది? అది 12వ కేసు అవుతుందని జగన్ వ్యాఖ్యానించడమంటే అతనికి చట్టం అంటే లెక్కలేనితనాన్ని స్పష్టం చేస్తోందన్నారు.
సీఎం జగన్ వివేకా హత్యను వాడుకున్నారని చంద్రబాబు విమర్శించారు. జగన్ ఇప్పుడు బయటకొచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సూత్రధారి ఎవరన్నది తేలిపోయిందని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఆనాడు గ్యాగ్ అర్డర్ తేవడం నుంచి.... ఇప్పుడు సీబీఐ విచారణను తప్పు పట్టడం వరకు హత్య కేసులో జగన్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు డైవర్ట్ పాలిటిక్స్ అమలు చేస్తున్న జగన్.. వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడం అసాధ్యమన్నారు. హత్యను పాత్రధారులకే పరిమితం చేయకూడదని.. హత్యకు గల సూత్రధారులను బోనులో నిలబెట్టాలన్నారు.
వివేకా హత్య కేసు సూత్రధారుల్ని బోనులో నిలబెట్టకపోతే రాష్ట్రంలో ఏ పౌరుడి ప్రాణాలకైనా రక్షణ ఉంటుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్ కోటలోనే వైఎస్ తమ్ముణ్ని హత్యచేయడం అంత:పుర పెద్ద ప్రోత్సాహం లేకుండా సాధ్యమా అని చంద్రబాబు ప్రశ్నించారు.
