జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్.. తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దపప్పూరు వద్ద పెన్నా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని జేపీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పెద్దపప్పూరు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు కూడా పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు యత్నించిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందే కూర్చొని నిరసనకు దిగారు. అయితే పోలీసులు ఆయనను కుర్చీతో పాటు బలవంతంగా తిరిగి ఇంట్లోకి తరలించారు. మరోవైపు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలపై పోలీసులు మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ఇసుక తరలించే వాహనాలను ధ్వంసం చేస్తానని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.