తన కుమారుడు రవితేజను టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో రవితేజ కనిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మరికొద్దినెలల్లో సార్వత్రిక ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీనియర్ నేతలంతా తమ వారసులను రంగంలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ రెండింటిలోనూ ఇదే తరహా వాతావరం కనిపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన కుమారుడు రవితేజను ప్రమోట్ చేస్తున్నారు. రాజకీయాల్లో గోల్డెన్ హ్యాండ్గా గంటా శ్రీనివాసరావుకు పేరుంది. ఎంపీగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓటమి ఎరుగని నేతగా ఆయనకు రికార్డు వుంది. అంతేకాదు.. నాలుగు పర్యాయాలు, నాలుగు వేర్వేరు స్థానాల నుంచి పోటీ చేసిన గెలిచిన అరుదైన ఘనత గంటా సొంతం. ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా వున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో భీమిలీ నుంచి పోటీ చేసే అవకాశాలు వున్నాయి.
అయితే 2024 ఎన్నికలు గంటాకు చివరి ఎన్నికలు కావొచ్చని విశాఖ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై తన వారసుడిగా రవితేజ రంగంలోకి దింపాలని గంటా భావిస్తున్నారు. అదే నిజమైతే రవితేజకు టీడీపీలో ఎదురులేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన గంటాకు కుమారుడైతే, మరో సీనియర్ నేత నారాయణకు అల్లుడు. ఇద్దరూ తెలుగుదేశంలో బలమైన నేతలు కావడంతో అధిష్టానం కూడా ఎదురుచెప్పకపోవచ్చు.
Also Read: సీఎం జగన్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు.. ‘అమ్మ ఒడిపై మాట తప్పారు’
తొలి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ, మీడియాలో కానీ అంతగా కనిపించని రవితేజ తొలిసారిగా బయట కనిపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో రవితేజ పాల్గొన్నారు. గత వారం రోజులుగా లోకేష్ పక్కనే కనిపిస్తున్నారు. ఈ క్రమంలో రవితేజ పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.