అలసిపోయాను.. ఈ ఎన్నికల్లో పోటీచేస్తా..టీడీపీ నేత
గతంలో మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ సారి అలా జరగకూడదని అనుకుంటున్నట్లు చెప్పారు.
ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీచేసి తీరతానని రాజమహేంద్రవరం టీడీపీ నేత, గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ పేర్కొన్నారు. తాను ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నానని, పార్టీ జెండా మోస్తూనే ఉన్నానని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఇప్పుడు అలసిపోయానని.. 2019 ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆయన వివరించారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ... గతంలో మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ సారి అలా జరగకూడదని అనుకుంటున్నట్లు చెప్పారు. ఒకసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి పోయిందన్నారు. తర్వాత తన భార్య, కుమార్తెలకు పోటీచేసే అవకాశం వస్తే.. తాను వద్దన్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికల్లో తనకు బూరుగుపూడి నియోజకవర్గం టికెట్ కేటాయించాలని చంద్రబాబుని కోరనున్నట్లు చెప్పారు. ఒక వేళ టికెట్ ఇవ్వకపోతే.. ఎవరికి టికెట్ ఇస్తే వారి గెలుపు కోసం కీలక పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు.