తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రోజున నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌పైకి ఏపీ పోలీసులు దూసుకురావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. నాగార్జున సాగర్‌పై దాడి రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేక స్వీయ ప్రయోజనాల కోసమా అని టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రశ్నించారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రోజున నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌పైకి ఏపీ పోలీసులు దూసుకురావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారంటూ ఏపీ, తెలంగాణల్లోని విపక్షాలు వైసీపీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. సెంటిమెంట్‌ను రగిల్చి తద్వారా తన మిత్రుడు కేసీఆర్ లబ్ధి పొందేలా జగన్ కుట్ర చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి వైసీపీ సైతం అదే రేంజ్‌లో కౌంటర్ ఇస్తోంది. న్యాయంగా మనకు రావాల్సిన నీటి వాటాల కోసమే ఇలా చేశామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ విమర్శలు ఆగడం లేదు. 

తాజాగా టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కృష్ణా జలాల కేటాయింపుల్లో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై జగన్ కనీసం కేంద్రానికి కూడా లేఖ రాయలేదన్నారు. అలాంటి వ్యక్తి హఠాత్తుగా రైతుల కోసం సాగర్‌పై దండయాత్ర చేశానని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని దూళిపాళ్ల ఎద్దేవా చేశారు.

Also Read: Nagarjuna sagar : కృష్ణా జలాలపై వివాదం ఇప్పుడే ఎందుకు?

నాగార్జున సాగర్‌పై దాడి రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేక స్వీయ ప్రయోజనాల కోసమా అని నరేంద్ర ప్రశ్నించారు. రాష్ట్ర నీటి హక్కులు కాపాడాలనే తపన, తాపత్రయం ఈ నాలుగున్నరేళ్లలో జగన్‌లో ఎక్కడా కనిపించలేదని ఆయన ఎద్దేవా చేశారు. నీళ్ల కోసం రైతులు రోడ్డెక్కినా, చివరి ఆయుకట్టు భూములు ఎండిపోతున్నా స్పందించని జగన్ సరిగ్గా తెలంగాణ ఎన్నికల రోజు సాగర్‌పైకి పోలీసులను పంపడం దిగజారుడుతనమేనని నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలుగువారి మధ్య చిచ్చు రేపేందుకు జగన్ ఈ వివాదం సృష్టించారా .. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలనుకుంటున్నారా అనేది జగన్ సమాధానం చెప్పాలని ధూళిపాళ్ల నిలదీశారు. 23 మంది ఎంపీలు వుండి కూడా కేంద్రంతో రాష్ట్రానికి నీటి వాటాపై జగన్ ఏనాడు మాట్లాడలేదని నరేంద్ర ఫైర్ అయ్యారు. జగన్ సీఎం అయ్యాకా తెలంగాణ ప్రభుత్వం ఎన్నోసార్లు శ్రీశైలం నీటిని వాడుకుందని , అయినా జగన్ అభ్యంతరం తెలపలేదన్నారు. జగన్‌కు తన ప్రయోజనాలు, తన కేసులు మాఫీ తప్పించి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. అనేక సందర్భాల్లో ఏమీ పట్టనట్లుగా మౌనంగా వున్న జగన్ రెడ్డి.. తెలంగాణ ఎన్నికల సమయంలో కావాలనే జగన్నాటకం మొదలుపెట్టారని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు.