జగన్ను సీబీఐ కేసులో ఇరికించమన్నారు: బాబుపై టీడీపీ నేత వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ రాష్ట్ర నేత చెన్నంశెట్టి శశికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో శశికుమార్ కాషాయం తీర్ధం పుచ్చుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ రాష్ట్ర నేత చెన్నంశెట్టి శశికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో శశికుమార్ కాషాయం తీర్ధం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓబుళాపురం మైనింగ్ కేసులో జగన్ని అక్రమంగా ఇరికించేలా సీబీఐ అధికారుల వద్ద ఆయన పేరు చెప్పాలంటూ బాబు అప్పట్లో తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
కేసు విచారణలో జగన్ పేరు చెప్పలేదని అప్పటి నుంచి తనపై పార్టీ పెద్దలు కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని శశికుమార్ తెలిపారు. చంద్రబాబు చెప్పినట్లు వినలేదనే ఐదేళ్ల కాలంలో తనకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు ఆవేదన వ్యక్తం చేశారు.
30 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా పనిచేస్తే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కనీసం తనను పట్టించుకోలేదని శశికుమార్ వాపోయారు. తన అన్న సి.రామచంద్రయ్యను కాదని తాను టీడీపీలో కొనసాగానని... పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తే తనను కనీసం గుర్తించలేదని ఆరోపించారు.
ఇప్పటికైనా టీడీపీ అధినేత తీరు మార్చుకోకపోతే రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని.. ఇప్పటికే చాలామంది పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని శశికుమార్ బాంబు పేల్చారు.
అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పెద్దలు కేవలం వారి సామాజిక వర్గానికి పదవులు కట్టబెడుతూ.. రాజకీయాల్లో కనీస అవగాహన లేని లోకేశ్కు మంత్రి పదవినిచ్చి పార్టీలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పనిచేసిన కార్యకర్తలన, నేతలను విస్మరించారని శశికుమార్ దుయ్యబట్టారు.