వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. హత్యలో జగన్ పాత్ర లేకపోతే అవినాష్ రెడ్డినీ పార్టీ నుండి సస్పండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వివేకా గుండెపోటు డ్రామాకు తెర పడిందన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినాష్ రెడ్డి హత్య చేపించాడని కేసులో నిందితులు సీబీఐకి చెప్పారని అన్నారు. ఈ హత్యలో జగన్ కు కూడా పాత్ర ఉందని వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యలో విజయసాయి రెడ్డినీ కూడా ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు. గుండెపోటుతో చనిపోయాడని ఏవరు చెప్తే విజయసాయి రెడ్డి చెప్పారో విచారణ చేయాలన్నారు.
రెండో పెళ్లి వివాదంతోనే హత్య జరిగిందని మాట్లాడడం సిగ్గు చేటని వెంకన్న చురకలంటించారు. పైశాచికంగా హత్య చేసి టీడీపీపై నింద వేశారని.. వివేకా హత్య జరగకపోతే 2019లో జగన్ అధికారంలోకి వచ్చేవారు కాదని బుద్ధా వ్యాఖ్యానించారు. హత్యలో జగన్ పాత్ర లేకపోతే అవినాష్ రెడ్డినీ పార్టీ నుండి సస్పండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ కుటుంబం హత్యపై స్పందించాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. వైఎస్ కుటుంబానికి రక్షణ కల్పించాలని.. ప్రజలు ఓట్లు వేయకుంటే రాష్ట్రంపై అణుబాంబు వేసెంత ఘనులని ఆయన సెటైర్లు వేశారు.
ALso REad: అన్నింటికి సిద్దంగానే ఉన్నా: వివేకా హత్యపై వైఎస్ భాస్కర్ రెడ్డి
ఇదిలావుండగా.. వివేకానందరెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించొద్దని వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ అధికారులను కోరారు. ఆదివారంనాడు కడపలో సీబీఐ విచారణకు ఆయన హాజరయ్యారు. అనంతరం భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ హత్య జరిగిన రోజున పులివెందులలో లభ్యమైన లెటర్ పై విచారణ జరిపించాలని ఆయన కోరారు. తాను అన్నింటికి సిద్దంగానే ఉన్నానని వైఎస్ భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసును విచారించే విచారణ అధికారి లేనందున మళ్లీ నోటీసులు ఇవ్వనున్నట్టుగా అధికారులు చెప్పారన్నారు. ఈ కేసు పరిష్కారం కావాలంటే వివేకా ఇంట్లో లభ్యమైన లేఖను పరిశీలించాలని భాస్కర్ రెడ్డి కోరారు. ఎన్ని దర్యాప్తు సంస్థలు ఈ కేసును విచారించినా పరిష్కారం కావాలంటే ఆ లేఖ ఆధారంగా పరిశోధన చేయాలని ఆయన చేతులు జోడించి ప్రార్ధించారు.
సీబీఐ అధికారులు ఇచ్చిన నోటీసు మేరకు తన ఆరోగ్యం సహకరించకపోయినా కూడా విచారణకు హాజరైనట్టుగా వైఎస్ భాస్కర్ రెడ్డి చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాకు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కేసు విషయమై తాను కొత్తగా చెప్పదల్చుకున్నది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారనే ప్రచారంపై మీడియా ప్రతినిధి ప్రశ్నకు ఆయన స్పందించారు. అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండన్నారు. తాను అన్నింటికి సిద్దంగానే ఉన్నానని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
